కుప్పం నియోజకవర్గంలో టీడీపీ దారుణ పరాభావాన్ని చూసిన తర్వాత వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి పెంచారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అని, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడినని చెప్పుకుంటూ చంద్రబాబు రెచ్చిపోతుంటారని, ఇకనైనా చంద్రబాబు ఆ మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు మంత్రి కన్నబాబు.

గతంలో చంద్రగిరి నుంచి చంద్రబాబు కుప్పం వెళ్లిపోయారని, మళ్లీ ఇప్పుడు కుప్పం నుంచి కొత్త నియోజకవర్గం వెతుక్కుంటే వెతుక్కోవచ్చని సలహా ఇచ్చారు కన్నబాబు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అంతా ఒకేలా ఉందని, కుప్పంలోలాగే అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ దారుణ పరాభవాలను మూటగట్టుకుందని, వాటిని తప్పించుకోవాలంటే బాబు రాష్ట్రం మార్చేయాల్సిందేనని అన్నారు. ఇటు తెలంగాణ నుంచి అటు అండమాన్‌ వరకు ఆయన పార్టీ ఉంది కాబట్టి ఎక్కడైనా కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కోవచ్చని అన్నారు. అండమాన్‌ నికోబార్‌ లో కూడా వారి పార్టీ ఉంది కాబట్టి, చంద్రబాబు అక్కడికి వెళ్తారేమో అని వైసీపీ వాళ్లంతా అనుకుంటున్నామని చెప్పారాయన.

మొత్తమ్మీద సొంత నియోజకవర్గంలో దారుణ ఓటమి చంద్రబాబుని బాగా కుంగదీసినట్టు అర్థమవుతోంది. కుప్పం నియోజకవర్గ పరిధిలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా 4 ఏకగ్రీవాలయ్యాయి. అవి పోను మిగతా 89 చోట్ల మూడో దశలో ఎన్నికలు జరిగాయి. 74 చోట్ల వైసీపీ బలపరచిన అభ్యర్థులు సర్పంచ్ లు గా గెలవగా, కేవలం 14సీట్లకి టీడీపీ మద్దతుదారులు పరిమితం అయ్యారు. ఒకచోట ఇండిపెండెంట్ కి అవకాశం దక్కింది. ఇప్పటి వరకూ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ మాదే, వైసీపీ పతనం మొదలైందని చెబుతూ వస్తున్న చంద్రబాబుకి ఇది నిజంగా షాకింగ్ న్యూసేనని చెప్పాలి. వైసీపీ వారు జోకులేసినట్టు నిజంగానే చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని మార్చేస్తారో లేదో వేచి చూడాలి.

తొలి రెండు దశల్లో టీడీపీకి గణనీయమైన సీట్లు వచ్చాయని చెప్పుకుంటున్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గం జయాపజయాలపై ఎలాంటి విశ్లేషణ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: