అయితే ఆవు పేడ ఒంటినిండా రాసుకుంటే కరోనా వైరస్ అస్సలు దరిచేరదని మరొక ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఐతే కరోనా సంక్రమించడం దేవుడెరుగు కానీ ఆవు పేడ వలన బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్(మ్యూకోర్మైకోసిస్) వచ్చే ప్రమాదం ఉందని గుజరాతి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆవు పేడ శరీరానికి రాసుకోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయని.. ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు గోశాలల వద్ద క్యూ కడుతూ ఆవుపేడ ఒంటినిండా పూసుకుంటున్నారు. ఆ తర్వాత తమ శరీరాన్ని పాలు, మజ్జిగతో కడుగుతున్నారు. పేడ రాసుకోవడం వల్ల తమకు రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరిగి కరోనా వైరస్ సంక్రమించదని వారు విశ్వసిస్తున్నారు.
ఐతే ఆవుపేడ రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. వైరస్ రాకుండా రక్షిస్తుందని ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలో తేలలేదని.. ఆవు పేడ సమర్థవంతమైనదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ కుమార్ చెప్పారు.
"ఆవు పేడ అనేది కేవలం ఒక జంతువు మలవిసర్జన మాత్రమే. ఆవు పేడ, ఆవు మూత్రం రోగనిరోధక శక్తి పెంచుతాయనేది పూర్తిగా అవాస్తవం. గోమూత్రం, పేడ కరోనా వైరస్ నుంచి అసలు కాపాడలేవు. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి తప్ప ప్రజలు ఇలాంటివి నమ్మకూడదు. ఆవు పేడలో చాలా రకాల ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ శరీరంలోకి చొచ్చుకుపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు ఇప్పటికైనా అసత్య ప్రచారాలను నమ్మకుండా జాగ్రత్త పడాలి" అని సీనియర్ డాక్టర్ మోనా దేశాయ్ చెప్పుకొచ్చారు.