తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని కొద్ది రోజులుగా ఓ వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ అధికార టీఆర్ఎస్ కు ఎవరికి వారు తామే ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ - బిజెపి ఉన్నాయి. మొన్నటి వరకు అక్కడ కారు పార్టీకి బిజెపి వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ అవుతుందని అందరూ అంచనా వేశారు. అయితే రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఇప్పుడు సీన్ మారుతోంది. గులాబీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వచ్చే ఎన్నికల్లో రసవత్తర పోరు తప్పదని రాజకీయ మేథావులు అంచనా వేస్తున్నారు. ఇక బిజెపి సైతం దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వచ్చిన ఊపునే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ చేయాలని చూస్తోంది.
ఈ ట్రయాంగిల్ ఫైట్ ఇలా ఉండగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతూ తెలంగాణ రాజకీయ రణక్షేత్రం లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. షర్మిల కొత్త పార్టీ పెడుతున్నానని నాలుగు నెలల క్రితమే ప్రకటన చేశారు. ఖమ్మం లో భారీ బహిరంగ సభ పెట్టారు. షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ లీకులు కూడా వస్తున్నాయి. షర్మిల ఎంత హడావిడి చేస్తున్నా తెలంగాణలో ఆమె పార్టీ కి మనుగడ ఉండడం క ష్టమే ?
ఆ మాటకు వస్తే ఎన్టీఆర్కు తెలంగాణలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు టీడీపీని వదిలేసి వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఇక రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటు బ్యాంకుపైనే షర్మిలకు ఆశలు ఉన్నాయి. గతంలో వీళ్లంతా వైఎస్సార్ అభిమానులు. ఇక్కడ వైఎస్ అభిమానులు ఎక్కువ ఉన్నంత మాత్రానా వాళ్లు... పైన చెప్పుకున్న కులాలు అన్ని షర్మిల వెంట ఇప్పుడున్న పరిస్థితుల్లో నడిచే అవకాశమే లేదు. పైగా రేవంత్కు కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడంతో అది షర్మిలకు మరింత షాకే ? కనీసం రెడ్డి ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. నాలుగు నెలల్లో షర్మిల పార్టీలోకి ఒక్క పేరున్న నేత కూడా రాలేదు. అంతకు మించి షర్మిల పార్టీ ఇక్కడ సాధించేది ఏం ఉండదని.. తెలంగాణ పొలిటికల్ ఆటలో ఆమె బలికావడం ఖాయమే అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి