కర్నూలు : ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవధ చట్టాన్ని ఎత్తివేయాలని....గోవధ చట్టం అసలు అమలు సాధ్యం కాదని మరో వివాదానికి తెర లేపారు ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి... భారత్ దేశంలో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటి అని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ, ఆర్ ఎస్ ఎస్ , భజరంగధల్ బక్రీద్ పండుగ రోజు గోవధ చట్టాన్ని వివాదంగా మారుస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రపంచంలో ఎక్కడా గోవధ చట్టం అమలులో లేదని ఆయన పేర్కొన్నారు. 


లౌకిక దేశంలో గోవు పూజించే వారికి పూజించే వస్తువు అని...తినే వారికి అది ఆహార వస్తువు అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆహార అలవాట్లపై నిషేధం విధించడం పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని తెలిపారు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే గా తాను చెప్పడం లేదు...ఒక లౌకికవాదిగా చెప్తున్నానని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అన్నారు. మునులు గోవులను తిన్నట్టుగా నేను విన్నాను..మైనార్టీలపై గోవధ చట్టం పేరుతో రాద్ధాంతం చేయడం కరెక్టు కాదని తెలిపారు. గోవధ నియంత్రణ యంత్రాంగం ఏ ప్రభుత్వం దగ్గర లేదని గుర్తు చేశారు.. 


చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు మన చట్టాల్లో ఈ కాలానికి అవసరం లేని చట్టాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. కాలం చెల్లిన చట్టాలలో గోవధ నిషేధ చట్టం ఒకటి అని పేర్కొన్న ఆయన.... గోవులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆహార వస్తువులుగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి కైనా గోవధ నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. దీని వల్ల అనేక మత సామరస్యానికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. గోవధ నిషేధాన్ని ఎత్తివేస్తేనే అన్ని ప్రభుత్వాలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అభిప్రాయ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: