జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో స్పీడ్ పెంచారు. అధికార వైసీపీపై దూకుడుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడూలేని విధంగా పవన్ సైతం తన నోటికి పని చెప్పి మరీ వైసీపీ నేతలపై ఫైర్ అవుతున్నారు. అటు యథావిధిగానే వైసీపీ నేతలు సైతం తమదైన శైలిలో కౌంటర్లు కూడా ఇస్తున్నారు. అయితే పవన్ సడన్‌గా దూకుడు పెంచడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అవుతున్నాయి.

కానీ ఇప్పటివరకు పవన్ దూకుడుగా రాజకీయాలు చేయలేదు..జనసేన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయలేదు. అయితే మరో రెండు ఏళ్లలో ఏపీలో ఎన్నికల సందడి మొదలు అవుతుంది. అందుకే ఈలోపు పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని చూస్తున్నారు. వైసీపీ వైఫల్యాలని లేవనెత్తి ప్రజలని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే బలంగా ఉన్న వైసీపీ, టి‌డి‌పిలని దాటుకుని జనసేనకు ఏ మేర ప్రజా ఆదరణ వస్తుందనేది చూడాల్సి ఉంటుంది.

కాకపోతే పవన్ తనకు సాధ్యమైన మేర పార్టీని పైకి లేపాలని చూస్తున్నారు. ఇప్పటికే కోస్తాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇదే క్రమంలో రాయలసీమపై కూడా దృష్టి పెట్టి అక్కడ కూడా సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు. సీమలో వైసీపీ బాగా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ తర్వాత టి‌డి‌పికి బలం ఉంది. కానీ జనసేనకు కొంచెం కూడా బలం లేదు.

గత ఎన్నికల్లో సీమలో జనసేన దారుణంగా డిపాజిట్లు కోల్పోయింది. అయితే ఈ సారి సీమలో కొంతవరకు అయినా సత్తా చాటాలని పవన్ అనుకుంటున్నారు. అందుకే సీమలో ఎక్కువగా ఉన్న బోయ కులం గురించి పోరాటం చేయడం మొదలుపెట్టారు. బోయలని ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వారితో సమావేశాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అటు ఎలాగో బలిజ కులంలో పవన్‌కు మద్ధతు కాస్త ఉంది. మరి బోయలని కూడా దగ్గర చేసుకుని జనసేనని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ ఎన్ని చేసిన వైసీపీ-టి‌డి‌పిలని దాటుకుని సీమలో జనసేన సత్తా చాటడం కష్టమే అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: