అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ మధ్య నకిలీ ఓట్ల యుద్ధం మొదలైంది. ఈనెల 28వ తేదీన రెండుపార్టీలు ఢిల్లీలో మోహరిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమీషనర్ ను చంద్రబాబునాయుడు కలిసి వైసీపీపై ఫిర్యాదులు చేయబోతున్నారు. తమపార్టీకి అనుకూలంగా దొంగఓట్లను నమోదు చేయించుకోవటమే కాకుండా తమకు పడవు అని అనుమానం ఉన్న ఓట్లను భారీఎత్తున తొలగిస్తున్నారంటు చంద్రబాబు ఫిర్యాదు చేయబోతున్నారు. పార్టీ సేకరించిన వివరాలను, కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల చేర్పులు, మార్పులను ఉదాహరణగా అందించబోతున్నారు.
ఇదే సమయంలో ఇదే విధమైన ఫిర్యాదుతో నరేంద్రమోడీ, అమిత్ షా తో భేటీ అవబోతున్నారు వైసీపీ ఎంపీలు. అక్కడినుండి కేంద్ర ఎన్నికల కమీషనర్ తో భేటీ అవబోతున్నారు. వీళ్ళు కూడా ఇదే విధమైన ఫిర్యాదులను చేయబోతున్నారు. టీడీపీ నమోదుచేయించిన దొంగఓట్ల వివరాలను ఉదాహరణలతో సహా అందించబోతున్నారు. వైసీపీ లెక్కల ప్రకారం టీడీపీ 60 లక్షల దొంగఓట్లను చేర్పించింది. అందుకు ఆధారాలను కూడా సమర్పించబోతున్నారు. ఒకటైతే నిజం అదేమిటంటే 2019 ఎన్నికలకు ముదు భారీఎత్తున దొంగఓట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాయే స్వయంగా చెప్పారు.
2019 ఎన్నికలకు ముందు దొంగఓట్లు నమోదయ్యాయంటే ఎక్కువభాగం టీడీపీ చేయించిందే ఉంటుంది. కుప్పం నియోజకవర్గంలో దొంగఓట్లను భారీగా తొలగించినట్లు మీనా చెప్పారు. రేపటి ఎన్నికల్లో దొంగఓట్లను తొలగించటం తమ గెలుపుకు ఇబ్బందులు అవుతాయని టీడీపీ భావించినట్లుంది. అందుకనే ముందుజాగ్రత్తగా వైసీపీపై దొంగఓట్లంటు ఎదురుదాడులు మొదలుపెట్టింది.
నిజానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దొంగఓట్లను చేర్పించటం మామూలైపోయింది. రాబోయే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకమైనవి కావటంతో చంద్రబాబు, తమ్ముళ్ళు గోల చేస్తున్నారు. అసలు దొంగఓట్లపై మొదట మాట్లాడిందే జగన్మోహన్ రెడ్డి. ఆమధ్య గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతు భోగస్ ఓట్లను తొలగించటంపై అందరు దృష్టిపెట్టాలన్నారు. 12 లక్షల దొంగఓట్లు చేర్పించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దొంగఓట్ల ఏరివేత మొదలైన తర్వాతే చంద్రబాబు దొంగఓట్లను చేర్పిస్తున్నారంటు గోల మొదలుపెట్టారు. మరి ఢిల్లీ వేదికగా మొదలవ్వబోయే ఓట్లయుద్ధంలో ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి