వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు  ఎంఎల్ఏల్లో ముగ్గురికి చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపించారా ? పార్టీవర్గాల సమాచారం, మొదటిజాబితాలోని పేర్లు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రకటించిన పేర్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నుండి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఒక్కళ్ళకి మాత్రమే టికెట్ దొరికింది. వైసీపీ నుండి నలుగురు ఎంఎల్ఏలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డి, తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి ఫిరాయించారు.





అప్పట్లో వీళ్ళందరికీ చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో టికెట్లిస్తానని హామీ ఇచ్చి, ఆశపెట్టే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎగదోశారు. వీళ్ళకి జగన్ తో పడనికారణంగా నలుగురు చంద్రబాబుతో టచ్ లోకి వెళ్ళారు. రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్లు ఇచ్చేట్లయితే పార్టీమారిపోతామని కూడా అడిగారు. అయితే తొందరలోనే రాబోయే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళని వైసీపీలోనే కంటిన్యు అవమని చెప్పారు.





చంద్రబాబు చెప్పారుకదాని వైసీపీలోనే ఉంటు జగన్ పైన నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఎన్నికలు వచ్చినపుడు వైసీపీలోనే ఉంటు టీడీపీ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేసి గెలుపుకు సహకరించారు. తర్వాత వైసీపీ వీళ్ళని సస్పెండ్ చేసింది. తర్వాత బాహాటంగానే వీళ్ళంతా జగన్ కు వ్యతిరేకమై చంద్రబాబు మద్దతుదారులుగా మారిపోయారు. ఆ తర్వాత నలుగురూ టీడీపీలో చేరిపోయారు. ఇపుడు విషయంలోకి వస్తే టీడీపీ, జనసేన పొత్తులో కూటమి పోటీచేయబోయే మొదటి విడత జాబితాను చంద్రబాబు ప్రకటించారు.





జాబితాను చూస్తే నెల్లూరు రూరల్  లో కోటంరెడ్డి పేరు మాత్రమే కనబడింది. మిగిలిన ఆనం, మేకపాటి, శ్రీదేవి పేర్లు లేవు. అంటే వీళ్ళకి టికెట్లు ఇవ్వటంలేదని  అర్ధమైపోయింది. ఇది మొదటిజాబితానే కదా రెండో జాబితాలో ఉండచ్చని ఊరడింపు మాటలు మాట్లాడుతున్నారు కాని వీళ్ళకి పోటీచేయటానికి నియోజకవర్గమే లేదన్న విషయం అందరికీ తెలుసు. ఆనంకు వెంటకగిరి, ఉదయగిరి, సర్వేపల్లి, నెల్లూరు సిటిలో ఎక్కడ టికెట్ ఇవ్వాలన్నా అక్కడి తమ్ముళ్ళు ఒప్పుకోవటంలేదు. దాంతో ఎక్కడ పోటీచేయాలన్నా సీటు లేదని అర్ధమైపోతోంది. మొత్తానికి మరోసారి ఫిరాయింపుదారులకు చంద్రబాబు షాక్ ఇచ్చినట్లయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: