వైఎస్ షర్మిలా అస్సలు తగ్గట్లేదు. తన విమర్శలకు ఇంకా పదును పెంచుతున్నారు.తన అన్న జగన్ మీద యుద్ధం చేస్తున్న ఆమె.. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.సీఎం జగన్ ని బీజేపీ నేతగా ఆమె అభివర్ణించారు. వైసీపీని అందరూ బీజేపీ 'బీ' టీంగా అభివర్ణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే.. వైసీపీ బీజేపీకి బీ టీం కాదని.. ఆ పార్టీ బీజేపీలోనే ఉందంటూ మాటల చమత్కారాన్ని షర్మిళ ప్రదర్శించారు.ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో టార్గెట్ మోడీ.. టార్గెట్ బ్రదర్.. అన్నట్లుగా ఆమె అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా 2014 ఎన్నికల వేళలో.. నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న నరేంద్ర మోడీ.. ఏపీకి పత్యేక హోదా ఇస్తానంటూ తిరుపతి సభలో మొదటిసారి ప్రకటించటం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న ఆమె.. ఎక్కడైతే ఏపీకి హోదా హామీని మోడీ ఇచ్చారో.. అదే తిరుపతిలో శుక్రవారం నాడు 'ప్రత్యేక హోదా డిక్లరేషన్' పేరిట బహిరంగ సభను సిద్ధం చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను సాధించని కారణంగా రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేవ్ పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లుగా ఆమె మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ఇదే తీరు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో యువత కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు.


ప్రత్యేక హోదాతోనే ఏపీకి డెవలప్ మెంట్ సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రానికి హోదా అన్నది సంజీవినిగా ఉండాలని ఆమె అభివర్ణించారు. రాజకీయం కోసం ప్రత్యేక హోదాను జగన్ మోహన్ రెడ్డి వాడుకున్నారన్న ఆమె.. ''ప్రతిపక్షంలో ఉండగా జగన్.. దీక్షలు చేశారు. మూకుమ్మడిగా లోక్ సభ సభ్యులు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు?'' అంటూ షర్మిళ ప్రశ్నించారు.అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్ ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా పేరుతో రాజకీయం చేశారన్నారు. దేశరాజధాని ఢిల్లీని తలపించేలా రాజధానిని ఇస్తానని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారన్నారు. కానీ.. ఆ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఏకంగా 2వేల పరిశ్రమలు వచ్చాయని.. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని పది పరిశ్రమలు కూడా రాలేదంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కి 972 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని.. వాటి ఆధారిత పరిశ్రమలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ని హార్డ్ వేర్ హబ్ చేస్తామన్న మోడీ ప్రకటన వాస్తవంలో అదేమీ జరగలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: