![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/pawan-janasena-pithapuramcc35f78f-9aed-4a5d-95a2-4a85020647e0-415x250.jpg)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఒక విషయం బాగా ఇబ్బంది పెడుతోంది. అదేమిటంటే లోకల్-నాన్ లోకల్ ఇష్యూ. ఈ ఇబ్బంది పోయిన ఎన్నికల నుండి పవన్ను వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు నియోజకవర్గాలు గాజువాక, భీమవరంలో పవన్ ఓటమికి లోకల్ దెబ్బ కూడా కీలకమనే చెప్పాలి. ఎలాగంటే పవన్ గెలిచినా ఎవరికీ అందుబాటులో ఉండరని వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్ధులు పదేపదే ప్రచారంచేశారు.
గెలిచిన తర్వాత పవన్ కు ఏదన్నా సమస్యలు చెప్పుకోవాలన్నా, ఏ అవసరం మీద కలవాలన్నా అసలు అందుబాటులోనే ఉండరని అప్పట్లో వైసీపీ తరపున పోటీచేసిన తిప్పల నాగిరెడ్డి, గ్రంధి శ్రీనివాస్ జనాల్లోకి బాగా తీసుకెళ్ళారు. అనేక అంశాలకు లోకల్ దెబ్బ కూడా తోడవ్వటంతో రెండుచోట్లా ఓడిపోయారు. అయితే అదే దెబ్బ ఇపుడూ కంటిన్యు అవుతున్నట్లే ఉంది. ఎందుకంటే పవన్ భీమవరంలో పోటీచేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. భీమవరంలో టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులును పోటీచేయమని పవనే సూచించారు. ఈ విషయాన్ని పులపర్తే మీడియాతో చెప్పారు. పైగా పవన్ నాన్ లోకల్ అనే ప్రచారాన్ని గంధ్రి ఇప్పటికే మొదలుపెట్టేశారు.
భీమవరంలో పోటీఆలోచన మానుకుని పిఠాపురంలో పోటీచేసే విషయమై సర్వే చేయించుకుంటున్నారట. పవన్ ఆలోచన ఏమిటంటే ఇక్కడ కాపుల సామాజికవర్గం బాగా ఉందికాబట్టి గెలుపు సులభమని. అయితే ఇక్కడ నుండి టీడీపీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంఎల్ఏ ఎంవీఎన్ఎస్ వర్మ అందుకు ఒప్పుకోవటంలేదు. నాన్ లోకల్ వాళ్ళని పిఠాపురం ఓటర్లు ఆధరించరని పవన్ పేరెత్తకుండా చెబుతున్నారు. లోకల్ గా ఉంటు జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే తనను కాదని నాన్ లోకల్స్ కు జనాలు ఎందుకు ఓట్లేస్తారని వర్మ లాజిక్ లేవదీశారు.
పైగా పవన్ నాన్ లోకల్ అంటు పిఠాపురంలో ఫ్లెక్సీలు కూడా వెలిసినట్లు చెబుతున్నారు. ఒకవైపు సర్వే జరుగుతుండగానే మరోవైపు పవన్ నాన్ లోకల్ అని ఫ్లెక్సీలు వెలిశాయంటే ఏమిటర్ధం ? అంటే ఇక్కడ కూడా గెలుపు అనుకున్నంత ఈజీ కాదని అర్ధమవుతోంది. పైగా వైసీపీ తరపున పిఠాపురం మాజీ ఎంఎల్ఏ ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేయబోతున్నారు. ఈమె కూడా కాపు సామాజికవర్గమే. కాపులకన్నా నాన్ కాపుల ఓట్లు చాలా ఎక్కువ. ఏ రకంగా చూసుకున్నా పవన్ అనుకుంటున్నట్లు పిఠాపురంలో గెలుపు అంత వీజీకాదని అర్ధమైపోతోంది.