ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్న నియోజకవర్గాలలో గాజువాక ఒకటి. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో జనసేన నుంచి పవన్ పోటీ చేయగా పవన్ ను ఓడించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇచ్చాయి. అయితే తిప్పల నాగిరెడ్డిపై స్థానిక ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండటంతో ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ కు టికెట్ దక్కింది.
 
మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించకపోయినా జగన్ మాట కాదనలేక ఆయన ఇక్కడినుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి పల్లా శ్రీనివాస్ పోటీ చేయడం గమనార్హం. గాజువాకలో వైసీపీ జెండా ఎగిగే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నకు ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండనుందని ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నిర్ణయం తీసుకోవడంతో కూటమి తరపున పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాస్ కు గెలుపు సులువు కాదని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీకి అనుకూలంగా ప్రజల తీర్పు ఉండటంతో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చెప్పడం కష్టమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. గాజువాక నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
 
గుడివాడ అమర్నాథ్ కు గతంలో గాజువాక నుంచి కార్పొరేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ ను ఈ ఎన్నికల్లో గాజువాక నుంచి గెలిపించుకోవాలని జగన్ సైతం పట్టుదలతో ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు 2014లో గాజువాకలో టీడీపీ తరపున గెలిచి ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. గత ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిపాలయ్యారు. గాజువాకలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఆ పార్టీ సులువుగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: