దశాబ్దాలుగా బీజేపీకి మద్దతిస్తూ వస్తున్న రాజ్ పుట్ లు ఈ సారి ఆ పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యంగా యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో రాజ్ పుత్ లు ఏకంగా బీజేపీని వ్యతిరేకిస్తూ బహిరంగ సభలు, సమావేశాలు, కుల పంచాయితీలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ యూపీలోని సహానర్ పుర్ లో ఈనెల 7న రాజ్ పుత్ లు మహా పంచాయత్ నిర్వహించారు.


వారంతా బాయ్ కాట్ బీజేపీ అనే ఉద్యమానికి తెర లేపారు. ఈసారి 400 సీట్లే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీకి రాజ్ పుట్ ల వ్యవహారం తలనొప్పిగా మారింది. దీనంతటకీ కారణం గుజరాత్ లో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ఇటీవల దళిత సామాజిక వర్గంతో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. రాజులు, మహా రాజులు బ్రిటీష్ వారితో లాలూచీ పడ్డారని.. వారికి తమ కుమార్తెలు ఇచ్చి వివాహం చేశారని, దళితులు మాత్రం ఎన్ని అణిచివేతలకు గురైనా విలువలకు కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు.


దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గుజరాత్ తో పాటు పలు రాష్ట్రాల్లోని రాజ్ పుట్ లు భగ్గుమన్నారు. తీవ్ర నిరసన తెలుపుతున్నారు. మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పినా వారు శాంతించడం లేదు. రాజ్ కోట్ నుంచి రాపాల అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై రాజ్ పుట్ ల నాయకుడు స్పందిస్తూ.. మా చరిత్రను వక్రీకరించడం, ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో మాకు న్యాయం చేయకపోతే.. బీజేపీని ఓడించేందుకు పని చేస్తాం అని హెచ్చరించారు.  


ఆయన్ను అభ్యర్థిత్వం నుంచి తొలగించాలని పట్టుపడుతున్నారు. వీరు గుజరాత్ లో ఏడు ఎంపీ సీట్లతో పాటు యూపీలో కూడా గణనీయమైన ప్రభావం చూపగలరు. ఇదే సమయంలో రూపాల కూడా బలమైన పాటిదార్ వర్గానికి చెందిన నేత. ఈయన్ను పక్కన పెడితే.. ఈ వర్గం దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక బీజేపీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: