ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కచ్చితంగా లెక్కెస్తే పట్టుమని మూడు వారాల సమయం. ఈ లోగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఆయా పార్టీల.. ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.  ఇంత తక్కువ సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఆయా పార్టీల అధినేతలు విద్వేషపూరిత ప్రసంగాలు ఇస్తున్నారు.


ఇదంతా నిజమేనని నమ్మిన పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీలను శత్రువుల కంటే దారుణంగా చూస్తున్నారు. కనిపిస్తే దాడి చేసేయాలి అనే భావనను కార్యకర్తల్లో పార్టీ నాయకులు నూరిపోస్తున్నారు. దీంతో వారు రెచ్చిపోయి తలలు పగలుగొట్టుకుంటున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. చివరకు నిందితులు అవుతున్నారు. పార్టీలపై ప్రేమ ఉండొచ్చు. కానీ అది ఓట్లు వేయడానికే పరిమితం కావాలి తప్ప దాడులకు తెగ పడేంత ఉండకూడదు అనేది విశ్లేషకులు అభిప్రాయం.


క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా దాడులకు పాల్పడేముందు మీ కుటుంబాలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. దాడులు చేసి..  ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చినా మీకు చేకూరే ప్రయోజనం శూన్యం అని గుర్తించాలని కోరుతున్నారు. ఒకవేళ ఈ దాడిలో గాయపడితే పార్టీల నాయకులు వచ్చి పరామర్శలకే పరిమితం అవుతారు కానీ మీ కుటుంబ బాధ్యతలను తీసుకోరు అని చెబుతున్నారు. ఒకవేల దాడి చేసి దొరికితే మీపై రౌడీ షీటర్లు, పీడీ యాక్టులు తదితర కేసులు పెట్టి జీవితాంతం ఒక నేరస్థుడిగానే చూస్తారు తప్ప పార్టీలో గౌరవ స్థానం అయితే ఇవ్వరు.


ఏ పార్టీలు కూడా మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవు. వాళ్ల అవసరాల కోసం మిమ్మల్ని పావులుగా వాడుకుంటారు అంతే .  పార్టీ నాయకులపై, పార్టీలపై అభిమానం ఉండటం సహజం. కానీ నీ ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన అవసరం ఉందా అనేది ఆలోచించుకోవాలి. సాధ్యం అయితే గొడవలు జరగకుండా ఆపండి.. లేకపోతే అక్కడి నుంచి వెళ్లిపోండి. అంతేకానీ లేనిపోని విషయాల్లో తలదూర్చి మీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టొద్దు అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: