ఏపీ సీఎం జ‌గ‌న్ పోటీ చేస్తున్న పులివెందుల‌లో ఎలాంటి మెజారిటీ వ‌స్తుంది? ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజారిటీ కంటే మించుతుందా?  లేక త‌గ్గుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి 2014 నుంచి ఆయ‌న మూడు సార్లు పులివెందుల‌లో పోటీ చేశారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ సీఎం జ‌గ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2019లో అయితే.. ఎన్న‌డూ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మెజారిటీ కైవ‌సం చేసుకున్నారు. దీంతో ఆయ‌న మెజారిటీపై ఎప్పుడూ చ‌ర్చ లేకుండా పోయింది.


కానీ, ఈ సారి ఎన్నిక‌ల్లో మాత్రం సీఎం జ‌గ‌న్ మెజారిటీపై తొలిసారి చ‌ర్చ వ‌చ్చింది. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకోవ‌డం పెద్ద విశేషం కాద‌ని.. మెజారిటీనే ముఖ్య‌మని కొంద‌రు రాజ‌కీయ పండితులు చెబుతు న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌.. 89 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ ద‌ఫా మాత్రం  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంత మెజారిటీ తెచ్చుకునే ప‌రిస్థితి లేద‌న్న‌ది.. రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తు న్న మాట‌. దీనికి కార‌ణం.. ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త క‌న్నా.. కూడా.. ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల చేసిన ప్ర‌చార‌మేన‌ని చెబుతున్నారు.


ష‌ర్మిల‌, సునీత‌లు ఇక్క‌డ జోరుగా ప్ర‌చారం చేశారు. వివేకా హ‌త్య వ్య‌వ‌హారాన్ని వారు ప్ర‌ధానంగా ఇక్క‌డ ప్ర‌చారం చేయ‌డంతోపాటు.. త‌మ‌కు న్యాయం జ‌ర‌గాలంటే.. జ‌గ‌న్‌ను అధికారం నుంచి దింపాల‌ని ప్ర‌చారం చేశారు. దీనికి తోడు ష‌ర్మిల కూడా క‌డ‌ప నుంచే పోటీ చేయ‌డంతో.. కొంత వ‌ర‌కు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి బ‌దిలీ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ సీఎం జ‌గ‌న్‌పై ప‌డుతుంద‌న్న అంచనాలు కూడా వ‌స్తున్నాయి.


ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ మెజారిటీ త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని  చెబుతున్నారు. దీనికితోడు టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న బీటెక్ ర‌వి కూడా.. ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని మ‌రికొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. ఆయ‌న‌కూడా బ‌ల‌మైన నాయ‌కుడు కావ‌డం.. క్షేత్ర‌స్థాయిలో పాద‌యాత్ర‌లు చేయ‌డం.. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం.. స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం వంటివి ప్ర‌భావం చూపిస్తాయ‌ని చెబుతున్నారు. ఇది కూడా సీఎం జ‌గ‌న్‌మెజారిటీ త‌గ్గించేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుంది?  అంద‌రి అంచ‌నాల మేర‌కు సీఎం జ‌గ‌న్ మెజారిటీ త‌గ్గుతుందా?  లేదా.. గ‌త ఎన్నిక‌ల్లోవ‌చ్చిన మెజారిటీతోనే ఆయ‌న గ‌ట్టెక్కుతారా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: