కరోనా ప్రపంచాన్ని వదిలేలా లేదు. ఇప్పటికే కరోనా  వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్ పై తయారీ సంస్థలు ఒక్కొక్కటిగా షాకింగ్ ప్రకటనలు చేస్తూ ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మారోసారి చాపకింద నీరులా విస్తరించడం కలకలం రేపుతోంది. తాజాగా సింగపూర్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మే 5 నుంచి 11 వ తేదీ వరకు ఆ దేశంలో 25,900 కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుంగ్ తెలిపారు.


వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నందున నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. సింగపూర్ లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. వారం వ్యవధిలో లోనే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తికి నిదర్శనం. ఇప్పటికే సింగపూర్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.


దీంతో చికిత్సకు సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అక్కడి ఆసుపత్రి యాజమాన్యాలను ఆదేశించింది. పడకల సామర్థ్యం పెంచాలని సూచించింది. ఇదిలా ఉంటే దేశంలో కరోనా నాలుగు వారాల్లోనే గరిష్ఠ స్తాయికి చేరుతుందని అక్కడి వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 250 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ లోనే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది.


ఏప్రిల్ చివరి వారంలో 13700 కేసులు నమోదు అయ్యాయి. మే నెలాఖరు నాటికి ఈ మహమ్మారి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో చేరకుండా ఇంటి వద్దనే బాధితులకు చికిత్స అందించే అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ మరోసారి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం సింగపూర్ లో కేపీ-1, కేపీ-2 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటి తీవ్రత ఇంకా నిర్ధారణ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: