రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల హామీలను అమలు చేయడం అంటే గట్టి సవాలే. కానీ చేయకపోతే ప్రజా అసంతృప్తి తప్పదనే భయం ఉండటంతో, అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల వర్షం కురిపించడం తప్పనిసరి అవుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే దృశ్యం కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తూ, లబ్ధిదారులకు నేరుగా డబ్బులు పంపిస్తున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్దగా నిధులు రాకపోవడం, వచ్చినా లెక్కలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండడంతో రాష్ట్రాలు ఇప్పుడు “సొంత వనరులు” వెతుక్కుంటున్నాయి. ఆదాయం తక్కువగా ఉండటంతో కొన్ని సంక్షేమ పథకాల కోసం కేటాయించిన డబ్బును మరో చోట నుంచి తీసుకోవడం సాధారణంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు కార్పొరేషన్ల నిధులు సంక్షేమ పథకాల దిశగా మళ్లుతున్నాయి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.


ఇటీవల ప్రారంభించిన ‘ఆటో డ్రైవర్ సేవ’ పథకంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.15,000 చొప్పున డబ్బులు జమ చేశారు. కానీ ఆ మెసేజ్‌లలో నిధులు కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుండి వచ్చాయని పేర్కొనడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. “ఇవి ప్రత్యేక కార్పొరేషన్ల నిధులే, వాటిని ఇతర పథకాలకు వాడటం సరి కాదు” అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే అధికార వర్గం వాదన వేరు. “కార్పొరేషన్ల ద్వారా అయినా, సంక్షేమ శాఖ ద్వారా అయినా, చివరికి డబ్బు పేదలకే చేరుతోంది కాబట్టి ఇందులో తప్పేముంది?” అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. కానీ ఆ వాదన అందరినీ నమ్మించలేకపోతోంది. ఎందుకంటే, కార్పొరేషన్లు స్వతంత్రంగా నిర్వహించాల్సిన పథకాలు ఇప్పుడు నిధుల్లేక కుదేలవుతున్నాయి.



ఇటీవలి కాలంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం నిధుల్లేక తమ కార్యక్రమాలు నిలిచిపోయాయని బహిరంగంగా చెప్పారు. ఆ పరిస్థితిలోనే వారి నిధులు ఇతర పథకాల కోసం వాడేయడం వివాదంగా మారింది. లబ్ధిదారులకు మెసేజ్‌ల రూపంలో ఆ వివరాలు వెళ్లిపోవడం వల్ల ఇప్పుడు సర్కారు ఇబ్బందుల్లో పడింది. ప్రజల దృష్టిలో చూసుకుంటే – డబ్బు వస్తే చాలు, ఎక్కడి నుంచి వచ్చిందన్నది పెద్ద విషయం కాదు. కానీ ఆర్థిక నియమావళి పరంగా ఇది సరైన పద్ధతి కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఎన్నికల హామీలు నెరవేర్చడం పేరుతో ప్రభుత్వాలు ఆర్థిక శాసనాలపై కత్తి పెట్టేస్తే, రాబోయే కాలంలో కార్పొరేషన్లు, సంక్షేమం రెండూ కుదేలయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: