నరేంద్ర మోడీ.. యావత్ ప్రపంచానికి రెండేళ్లుగా సుపరిచితమైన పేరు. 125కోట్ల మంది జనాభా ఉన్న భారత దేశానికి ప్రధాని అయినా.. ఆయన ఎంతో సాదాసీదాగా ఉంటారనే పేరుంది. అయితే ఎంత సింపుల్ గా ఉన్నా.. ఆయన ఓ రాజకీయ నాయకుడే. ఆస్థుల విషయంలో తోటి వారితో పోటీపడకున్నా.. ఎంతో కొంత కూడబెట్టారు. తాజాగా ప్రకటించిన ఆస్థుల వివరాలలో తానూ కోటీశ్వరుడినని మరోసారి తెలిపారు.
ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ అస్తులు పెరిగాయి. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో మోదీ ఆస్తుల విలువ రూ.1కోటి 73లక్షలు. 2014-15తో పోలిస్తే గతేడాది ఆస్తులు 22.6శాతం పెరిగాయి. నగదు కూడా దాదాపు 19రెట్లు పెరిగింది. గతేడాది తన దగ్గర రూ.4వేల 700 ఉన్నట్లు చూపిన మోదీ, ప్రస్తుతానికి రూ.89వేల 700 ఉన్నట్లు ప్రకటించారు. ఈ సారి కొత్తగా పుస్తకాల రాయల్టీని ఆయన ప్రస్తావించారు. తద్వారా తొలిసారి రూ.12లక్షల 35వేల ఆదాయం వచ్చినట్లు చూపారు. గుజరాత్ లోని గాంధీనగర్లో కోటి రూపాయల విలువైన ఆస్తి ఉందన్నారు. ఇక గతంలో చూపిన 4 బంగారు ఉంగరాలను ఈసారీ ప్రకటించారు. వాటి విలువ రూ.1లక్షా 27 వేలుగా చూపారు. గాంధీనగర్ ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలో రూ.2లక్షల 09వేలు, అదే బ్యాంకులో రూ.51.27 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు రూ.5.47లక్షల విలువైన ఎల్ అండ్ టీ ట్యాక్స్ సేవింగ్స్ బాండ్లు, ఎల్ఐసీ, జాతీయ సేవింగ్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. తన ఆస్తుల వివరాలు సమర్పించి ప్రధాని మోదీ.. తన భార్య ఆస్తుల వివరాలు మాత్రం తెలియదని పేర్కొన్నారు.
2014-15 సంవత్సరానికి మోదీ ఆస్తుల వివరాలు :
మోదీ 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనాలు లేవు. 2014-15 ఆర్థిక సంవత్సరాంతానికి పిఎంవో ప్రకటించిన ప్రకారం.. మోదీ వద్ద చేతిలో ఉన్న నగదు రూ. 4,700 మాత్రమే. 2014 ఆగస్టు 18 నాటికి మోదీ వద్ద చేతిలో నగదు రూ. 38,700 ఉండగా, 2015 మార్చి నాటికి రూ. 4,700లకు పడిపోయిందని వెల్లడించింది. గాంధీనగర్లో 13 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ఆయన నివాస భవనం విస్తీర్ణం 3,531 చదరపు అడుగులని తెలిపింది. ఇది ఆయనకు వారసత్వ ఆస్తి కాదని, 2002 అక్టోబర్ 25న రూ.1,30,488లకు కొనుగోలు చేసి, దాని అభివృద్ధికి రూ.2,47,208 పెట్టుబడి పెట్టారని తెలిపింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ 25 రెట్లకు పైగా పెరిగి సుమారు రూ. కోటి ఉంటుందని పేర్కొంది. మొత్తానికి ప్రధాని మోదీ స్థిర, చరాస్తులు 2015 మార్చ్ 31 నాటికి కొద్దిగా పెరిగాయని అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2013-14)తో పోల్చుకుంటే రూ. ఒక కోటి 26 లక్షల 12 వేల 288 నుంచి రూ. ఒక కోటి 41 లక్షల 14వేల 893కు పెరిగాయి.
మోదీకి గుజరాత్ లో తప్ప ఢిల్లీలో బ్యాంకు ఖాతా లేదని పిఎంవో తెలిపింది. మోదీ వద్ద 45 గ్రాముల బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ గత ఏడాదికాలంలో రూ. 1.21 లక్షల నుంచి రూ. 1.19 లక్షలకు పడిపోయింది. ఆయనకు ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్స్ లో రూ. 20 వేల విలువైన పెట్టుబడులు, రూ. 5.45 లక్షల జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, రూ. 1.99 లక్షల జీవిత బీమా, మొత్తంగా రూ. 41.15 లక్షల చరాస్తులు ఉన్నాయి. మోదీకి ఎలాంటి అప్పులు, రుణాలు లేవు. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మోదీ ఆస్తుల వివరాలను 2016 జనవరి 30వ తేదీ నాటికి పీఎంవో వెబ్ సైట్ లో వెల్లడించింది.