తాను చెప్పిన దానికి భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారా.. పాత సీసాలో పాత సారా అన్నట్లు సేనను నింపేస్తున్నారా.. అసలు పార్టీ ప్రతినిధులెవరు.. వాళ్ల రాజకీయ నేపథ్యం ఏమిటి.. వాళ్లేం మాట్లాడుతున్నారు..? వాళ్లపై జనం అభిప్రాయం ఏమిటి....? అనే విషయాలు పవన్ కళ్యాణ్ కు తెలుస్తున్నాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల కొందరు తాము జనసేన ప్రతినిధులమంటూ మీడియా ముందుకు రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అరెరె.. ఆయన ఫలానా పార్టీకి చెందిన నాయకుడు కదా.. ఎప్పుడు ఈ పార్టీలో చేరాడు.. మొన్నామధ్య మరేదో పార్టీ తరుపున మాట్లాడాడు కదా.. అంటూ సామాన్య కార్యకర్తలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. కొత్త తరానికి.. సరికొత్త రాజకీయం మార్గం సృష్టించడమే ధ్యేయంగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఇలా నిలకడలేని వారికి జనసేనలో అవకాశం ఇవ్వడం ఏమిటని పలువురు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. సరేగానీ.. ఇక విషయానికి వద్దాం...జనసేన ప్రతినిధులమంటూ ఇటీవల ముగ్గురు నలుగురు మీడియా ముందుకు వస్తున్నారు.
ఇందులో ప్రముఖంగా అద్దెపల్లి శ్రీధర్ ఒకరు. ఈయన సొంతూరు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటారు. ఎన్నికలకు ముందు రాజమహేంద్రవరం లో వాలిపోయి ఫ్లెక్సీలతో హడావుడి చేయడంలో ఆయన దిట్ట. ఏదైనా పార్టీ లో టికెట్ కోసం ప్రయత్నం చేయడం.. తేడావస్తే పట్నం వెళ్లడం ఆయన నైజం. ఇలాంటి నాయకుడు జనసేనలో ఒక్కసారిగా ప్రత్యక్ష మవడంతో అందరూ నోరెళ్లబెట్టడం తప్ప చేసేదేమీ లేదు. ఏదోఒక పార్టీ చెప్పుకుని టీవీల్లో చర్చా వేదికలు పంచుకోవడం ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలిదని పలువురు నాయకులు అంటున్నారు.
నిజానికి.. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి ముందు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ చిరంజీవి పార్టీ స్థాపించగానే అందులో దూకేసారు. అనంతరం పీఆర్పీని చిరంజీవి గాలికొదిలి తనదారితాను చూసుకోవడంతో అద్దెపల్లి శ్రీధర్ బీజేపీలో చేరారు. ఇప్పుడు జనసేనలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ విచిత్ర పరిస్థితి ఏమిటంటే... ఆయన బీజేపీ కి ఎప్పుడు రాజీనామా చేశారో.. అసలు చేశారో లేదో కూడా సామాన్య కార్యకర్తలకు తెలియదు. అలాగే జనసేన పార్టీలో కూడా ఎప్పుడు చేరారో తెలియదు. ఇలాంటి వాళ్లతో జనసేనను నింపేస్తున్న పవన్ కళ్యాణ్ పై జనం జాలిపడడం తప్ప ఏం చేయగలరు మరి.