రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. సీనియర్ మోస్టులు జూనియర్ల ముంద చేతులు కట్టుకోవడం, వారిని ఫాలో కావడం, చెప్పినట్టు విని, ఇచ్చింది పుచ్చుకోవడం అనేవి పాలిటిక్స్లో సాధారణంగా మారిపోయాయి. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకునేందుకు రెడీ అవుతోంది. సీనియర్ నేతగా టీడీపీలో చక్రం తిప్పుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.. టీడీపీలో ఉన్నారు. తనకు అనుకూలంగా పార్టీలను మార్చడంలో సిద్ధహస్తుడనే పేరు తెచ్చుకున్నారు గంటా.. అయితే, ఇప్పుడు ఆయననే మార్చాలని టీడీపీ నిర్నయించుకున్నట్టుగా తాజా పరిణామాలు ధ్రువ పరుస్తున్నాయి. గత రెండేళ్లుగా మంత్రి గంటా శైలిపై చంద్రబాబు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన నిర్వహిస్తున్న శాఖల సమీక్షలో పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, విశాఖ భూ కుంభకోణం.. పార్టీకి, ప్రభుత్వానికి కూడా మచ్చ తెచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ వేశారు. ఇదిలావుం టే, గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో పార్టీ పరిస్థితి బాగోలేదనే టాక్ వచ్చింది. ఇక్కడ గంటా ఫ్యామిలీ హవా పెరిగిపోయిందని, ఎవరి మాటనూ ఖాతరు చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంటాను తప్పిస్తార నే ప్రచారం కూడా సాగింది. తాజాగా వచ్చిన ఓ సర్వే ఏకంగా గంటాకు ఓటమి ని అంటగట్టేసింది. నిజానికి గంటాకు భీమిలి బలమైన నియోజకవర్గం. ఇక్కడ ఆయనకు తిరుగులేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, సదరు సర్వే మాత్రం ఉద్దేశపూర్వకంగానే తనపై రాసుకొచ్చారన్నది గంటా ఆవేదన. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్కు డుమ్మాకొట్టారు. అమరావతికి రాకుండా విశాఖపట్నంలోనే ఉండిపోయారు.
ఇక, గంటా అలక విషయం తెలుసుకున్న కొందరు నాయకులు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. గత రెండేళ్లుగా తనకు వ్యతిరేకంగా పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతున్నా... వాటిని ఎప్పటికప్పుడు అధినాయకత్వం దృష్టికి తీసుకెళుతున్నా ఫలితం లేకపోయిందని మంత్రి గంటా తన సన్నిహితులతో కొంతకాలంగా చెబుతున్నారు. తాజాగా సర్వే పేరుతో తనను అప్రతిష్టకి గురి చేసేలా, సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకత ఉందనేలా ప్రచారం జరగటానికి పార్టీయే ఆస్కారమిచ్చినట్లు మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి బ్యాంకు రుణం తీసుకున్నట్లు, విశాఖపట్నంలో భూముల కుంభకోణానికి పాల్పడినట్లు తనపై ఆరోపణలు రావటం వెనక, హైకోర్టులో పిల్ వేయటంలోను పార్టీలోని కొందరి పాత్ర ఉందన్నది ఆయన వాదన.
దాన్ని బలపరిచేలా సేకరించిన ఆధారాలను అధినాయకత్వానికి అందించినా... తనపై ఆరోపణలకు అడ్డుకట్ట పడలేదని, మరింతగా పెరిగాయని భావిస్తున్నారు. విశాఖపట్నం భూముల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ప్రభుత్వానికి చేరిందని, అందులో తన పాత్ర లేనట్లు తేలినా... దాన్ని బయటపెట్టక పోవటం కూడా తనను ఇబ్బంది పెట్టేందుకేనన్నట్లుగా ఆయన సందేహిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నట్లుగా ప్రచారం సాగుతుండటం మనస్తాపానికి గురి చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఇక, టీడీపీకి రాం రాం చెప్పడమే మంచిదని గంటా భావిస్తున్నట్టు తాజాగా ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనిపై రెండు రోజుల్లోనే వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా.. గంటా పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది.