జనసేన అధినేతకు ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ లేదని అంటున్నారు. ఆయన కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓ వర్గం ఓట్లు ఆయన పార్టీకి భారీ ఎత్తున వస్తాయన్న అంచనాలు మాత్రం అందరికీ ఉన్నాయి. పవన్ సైతం ఇదే ధీమాతో అడుగులు ముందుకు వేస్తున్నారు. మరి ఇపుడు చూస్తే పరిస్థితి వేరేగా ఉందంటున్నారు.
యూత్ ఓట్లు ఏవీ :
లేటెస్ట్ గా ఎన్నికల సంఘం చెప్పిన వివరాలు చూస్తే ఏపీలో జనాభా నిష్పత్తికి, ఓట్లకు మధ్య పెద్ద తేడా ఉందిట. ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీ ఈ విషయాన్ని మీడియా ముందే వెల్లడించారు. ఏపీలో 18 ఏళ్లు నిండిన యువత పెద్దగా ఓటర్లుగా నమోదు కావడంలేదని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఆ పరిస్థితి చూస్తే కొత్త ఓటర్లు ఏపీ ఎన్నికల్లో ఓటేయరా అన్న డౌట్లు వస్తున్నాయి. తొలిసారి ఓట్లు వేయాలన్న జోష్ వారిలో లేదా లేక వారి ఓట్లు కూడా లేకుండా పోయాయా అన్నది చూడాలి.
ఆ ఓట్లు ఎక్కువ అటే :
తొలిసారి ఓటు హక్కు ఉపయోగించుకునే వారు కొత్తగా ఆలొచిస్తారు. వారికి ఈ రాజకీయ గణితాలు, పార్టీలపైన, నాయకుల పైనా గుడ్డి అభిమానాలు ఉండవు, తమ ఓటు తో మొత్తం దేశాన్ని మార్చేయాలనుకుంటారు. ఆ ఓటర్లు ఇపుడు జనసేన వైపు చూస్తున్నారని కూదా విశ్లేషణలు ఉన్నాయి. మరి అటువంటి పెద్ద సంఖ్యలో ఉన్న కొత్త ఓటర్లు ఈసారి పెద్దగా నమోదు చేసుకోపోవడమేంటి. దీని వెనకాల మతలబు ఏంటి.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కొత్త ఓటర్లు పెరగలేదని ఏకంగా ఎన్నికల సంఘం చెబుతున్న మాటలు కలవరం కలిగించేవే. ఇప్పటికైనా కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వారిని ఆ దిశగా ప్రమోట్ చేసి తీసుకువస్తే ఎక్కువ లాభం జనసేనకే దక్కుతుంది. మరి ఆ పార్టీ ఏపీ డేటా చోరీపైన కూడా స్పందించడంలేదు. అలాగే ఓట్ల గల్లంతు పైనా ద్రుష్టి పెట్టడం లేదు. ఇప్పటికైన జనసైనికులు ఆ దిశగా రంగంలోకి దిగితే ఆ పార్టీకే మేలు జరుగుతుంది మరి.