తన భార్యను వేధిస్తున్నాడన్న అతడిని భర్త మందలించాడు. పెద్ద మనుషుల సమక్షంలో అతడిని మందలించి సమస్య కోర్టు దాకా వెళ్లకుండా రాజీ చేసుకున్నారు. కానీ మనసులో పెట్టుకున్న అతడు కోపంతో రగిలిపోయాడు. టైమ్ చూసుకొని కత్తులతో దాడి చేసి అంతమొందించాడు.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని మడమనూరులో అర్ధరాత్రి కొంతమంది శ్రీనివాసులు అనే వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనతో మనుబోలు మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే శ్రీనివాసులు ఆటోనడపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య శారదపై అదే గ్రామానికి చెందిన వినోద్ కుమార్ కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో శారద భర్త శ్రీనివాస్కు ఈ విషయాన్ని తెలిపింది.
పెద్ద మనుషుల సమక్షంలో వినోద్ను మందలించి కోర్టు వరకు సమస్య వెళ్లకుండా రాజీ చేసుకున్నారు. ఈ క్రమంలో కక్షపెంచుకున్నాడు వినోద్ అనే వ్యక్తి అతడిని చంపేందుకు ప్లాన్ చేశాడు. మంచి టైమ్ కోసం ఎదురు చూసాడు. టైమ్ చూసుకుని అర్దరాత్రి దుండగులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త హత్యతో శారద గుండెలవిసేలా రోదించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వినోద్ కుమారే తన భర్తను హత్య చేశాడంటూ పోలీసులకు మృతుడి భార్య శారద ఫిర్యాదు చేసింది.
శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య కేసును త్వరలోనే ఛేదిస్తామని తెలిపారు. మృతుడి ఒంటిపై చాలా సార్లు నరికిన కత్తిపోట్లు ఉన్నాయన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో కొన్ని ఆనవాళ్లు లభించాయని, త్వరలోనే కేసును ఛేదిస్తామన్న పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.