ఆర్.ఐ.ఎల్.. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ కంపెనీ. గత రెండేళ్లలో ఆర్ఐఎల్ నిలకడగా 17 శాతం పురోగతిని సాధించింది. కానీ.. ఈ ఏడాది ఆర్జనలో వృద్ధి సగానికి పరిమితమయ్యే అవకాశమున్నట్లు మోర్గాన్ స్టాన్లీ కొన్నిరోజుల క్రితం అంచనా వేసింది. దీంతో ఈ షేరుకి ఈక్వల్-వెయిట్ రేటింగ్ను ప్రకటించింది.
తాజాగా జియో ఫైబర్ ను ప్రకటించిన ముకేశ్ అంబానీ.. అతి త్వరలోనే ఆర్ ఐ ఎల్ ను అప్పుల్లేని స్థితికి తీసుకొస్తామని ప్రకటించారు. చమురు, రసాయనాల వ్యాపార విస్తరణ, 4జీ వైర్లెస్ టెలికాం నెట్వర్క్ ఏర్పాటుకు గత ఐదేళ్లలో ఆర్ఐఎల్ పెట్టిన పెట్టుబడి. పూర్తిగా రుణం రూపేణానే ఈ నిధులు సమీకరించింది.
అయితే .. దిగ్గజ చమురు ఎగుమతిదారు, సౌదీ సంస్థ అరామ్కోకు రిలయన్స్ చమురు, రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను అమ్మాలని రియయన్స్ కంపెనీ నిర్ణయించింది. దీని ద్వారా కొంత వరకూ అప్పులు తీర్చవచ్చని భావిస్తోంది. ఆరామ్కోకు 20 శాతం అమ్మడం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు రిలయన్స్ కు రానున్నాయి.
దీంతో పాటు రిలయన్స్ పెట్రోలు బంకుల విభాగంలో 49 శాతం వాటాను బ్రిటిష్ పెట్రోలియమ్ కు అమ్మాలని నిర్ణయించారు. ఈ అమ్మకం ద్వారా మరో 7 వేల కోట్ల రూపాయలు రిలయన్స్ కు రానున్నాయి. ఈ రెండు అమ్మకాల ద్వారా మొత్తం లక్షా పదిహేను వేల కోట్ల మొత్తం వస్తుంది. అయితే ఆరామ్కో కంపెనీతో రియలన్స్ చేసుకున్న ఒప్పందం కారణంగా.. గుజరాత్లోని జామ్నగర్ వద్ద రిలయన్స్కున్న రెండు రిఫైనరీలకు ఆ సంస్థ చమురు సరఫరా చేయాల్సి ఉంది.
రోజుకు 5,00,000 బ్యారెళ్లు చొప్పున చమురును అరామ్కో రిలయన్స్ సప్లై చేస్తుంది. ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి రిలయన్స్ కొనుగోలు చేస్తున్న చమురుతో పోలిస్తే ఇది డబుల్ అన్నమాట. మొత్తానికి రిలయన్స్ సంస్థను అప్పుల నుంచి బయటపడేసేందుకు ఆ సంస్థ 18 నెలల కాలపరిమితి విధించుకుంది.