భారతదేశం పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద తీరు కొనసాగుతోంది. యుద్ధం చేస్తామని, అంతర్జాతీయంగా భారత్ను ఏకాకి చేస్తామని బీరాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఇండియాతో వాణిజ్యసంబంధాలు తెంచుకోవడంతో పాటుగా చైనా అండతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇరకాటంలో పడేయాలని చూసి విఫలం అయింది. అయితే, పాక్ ప్రధాని ఇప్పుడు ఇండియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి సిద్దమయ్యాడు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీవోకే గురించి చేసిన కీలక వ్యాఖ్యల తరువాత ఇమ్రాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హరియాణాలో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇకపై పాకిస్థాన్తో చర్చలన్నవి జరిగితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశంపైనేనని అన్నారు. ``జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ప్రభుత్వం రద్దు చేయడంతో పాక్లో భయంపట్టుకుంది. అందుకే ఆయా దేశాల తలుపు తడుతుంది. మనమేమైనా నేరం చేశామా? ప్రపంచంలోనే బలమైన అమెరికా కూడా పాక్ మాటలను నమ్మడం లేదు. భారత్తో చర్చలు జరుపాలని ఆ దేశానికి చెప్పింది. ఏ అంశంపై మనం చర్చలు జరుపాలి? పాక్తో అసలు ఎందుకు చర్చలు జరుపాలి? తమ భూభాగంలో ఉగ్రవాదులకు సహాయాన్ని నిలిపివేస్తేనే పాక్తో చర్చలన్నవి జరుగుతాయి. అది కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) అంశంపైనే అని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో భారత్ అణ్వస్త్ర భద్రత, ఎన్ఆర్సీ, అణ్వస్త్రవిధానంపై కలుగజేసుకొని కామెంట్స్ చేశారు. మోదీ ప్రభుత్వం పాక్తో పాటు ప్రాంతీయంగా ముప్పు కలగజేస్తోందని, ఎన్ఆర్సీతో కొన్ని వర్గాలకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆరోపించాడు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో కలుగజేసుకోవాలని, భారత్ ను అడ్డుకోవాలని ఇమ్రాన్ ఖాన్ కోరాడు.