‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లోని కీలక పదవులకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ భవన్ లో ఈ ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2గంటల వరకు సాగింది. కాగా కోర్ట్ ఆదేశాల మేరకు పోలింగ్ మొత్తాన్ని వీడియో షూటింగ్ తీసారు. 2015-2017 దఫా గానూ ‘మా’ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధలు పోటీలో ఉన్నారు. మొత్తం 702 మంది సభ్యులు ఓటర్లుగా ఉండగా, కేవలం 394 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మునుపెన్నడూ లేని విధంగా పోటీలో ఉన్న ఆభ్యర్దులు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడంతో సినీమా లో రాజకీయ వాతావరణం సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా ఎన్నిక పట్ల సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తి రేగించాయి. ప్రస్తుతం ఎంపీ మురళీ మోహన్ ‘మా’కు అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్ష పదవికి మళ్ళీ తానే పోటీ చేయాలని భావించిన మురళీమోహన్, రాజమండ్రి ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచారాయన. దాంతో క్షణం తీరిక లేకుండా వున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు మురళీమోహన్. సమయం చాలదనో, మరే కారణాలో తెలియదు కానీ, ‘రేసులో వుండటంలేదు’ అని ప్రకటించేశారు.
ఇక పోలింగ్ ను పరిశీలిస్తే.. ఉదయం నుంచే అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న రాజేంద్ర ప్రసాద్, జయసుధలతో పాటు నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, నాగబాబు, కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, సుమన్, ప్రకాష్ రాజ్, రోజా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ‘మా’ ఎన్నికలు ఇప్పటికి ముగిసినా, ఫలితాలు మాత్రం ఇప్పుడే విడుదలయ్యే అవకాశం లేదు. ‘మా’ ఎన్నికల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యేవరకూ ఫలితాలు వెలువడే పరిస్థితి లేదని ఎన్నికల ఆధికారులు తెలిపారు.