కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు తిరుమల స్థానికులకు జూన్ 10వ తేదీ శ్రీవారి దర్శనాని కల్పించనున్నారు. ఇందుకోసం జూన్ 9న తిరుమలలోని మూడు ప్రాంతాలలో టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని 12 కౌంటర్లలలో మంగళవారం ఉదయం 8.00 గంటల నుండి దర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. ఈ కౌంటర్లలో చెరో 5 కౌంటర్లు సిఆర్వో, కౌస్తుభంలలో, ఆర్టిసి బస్టాండ్లో రెండు కౌంటర్లలో 6 వేల ఉచిత టోకెన్లు మంజూరు చేయనున్నారు. జూన్ 8, 9వ తేదీలలో ప్రయోగత్మకంగా టిటిడి ఉద్యోగులకు దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే.
ఇందుకోసం సోమవారం ఉదయం నుండి టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి తిరుమలలోని శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీ కేంద్రాలను పలు మార్లు అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. దర్శనానికి వచ్చేఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ రూపొందించిన మార్కింగ్లో నడవాలని సూచించారు. కాగా అలిపిరి చెక్ పాయింట్ వద్ద దర్శనం టోకెన్లు కలిగిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ మరియు శానిటైజెషన్ చేసిన అనంతరం మాత్రమే తిరుమల దర్శనానికి అనుమతిస్తున్నారు.
తిరుమల శ్రీవారిని జూన్ 11వ తేదీ దర్శించుకునే భక్తులకు జూన్ 10వ తేదీ నుండి తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 12 కౌంటర్లలలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, విష్టునివాసం, అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్లలో బుధవారం ఉదయం 5.00 గంటల నుండి దర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఒక్కరోజు ముందుగా తిరుపతిలో దర్శనం టోకెన్లు పొందవచ్చని తెలిపారు. అయితే అవగాహన కోసమే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే భక్తుల రాక పెరిగితే అవసరమనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని టికెట్ల జారీ సంఖ్యను పెంచుతామని చెప్పారు.