
ఈ సీజన్లో CSK ఆడిన తొలి 8 మ్యాచ్లలో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అంతేకాదు, 10 జట్ల టోర్నీలో అత్యంత దారుణమైన నెట్ రన్ రేట్ (-NRR) కూడా వీరిదే. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్లూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే, రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఎంఎస్ ధోనీ.. ఇక తమ ఫోకస్ ఐపీఎల్ 2026 కోసం జట్టును సిద్ధం చేయడంపైనే ఉందని ఇప్పటికే సంకేతాలిచ్చాడు.
"నిజమే, ఇదే CSK బలహీనమైన జట్టు. ఆటగాళ్లలో పోరాడే తత్వం కనిపించడం లేదు. CSKకి పేరు తెచ్చిన దూకుడైన ఆటతీరు ఇప్పుడు మచ్చుకైనా లేదు" అని రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. వేలంలో జరిగిన తప్పులను కూడా రైనా ఎత్తి చూపాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, ఆర్ అశ్విన్ వంటి అనుభవజ్ఞులైన భారత ఆటగాళ్లను తీసుకున్నా.. వారు దారుణంగా విఫలమయ్యారని అన్నాడు. ఆలస్యంగానైనా ఆయుష్ మాత్రే వంటి యువ ఆటగాడికి అవకాశం ఇవ్వగా, ముంబై ఇండియన్స్పై అరంగేట్రం మ్యాచ్లోనే నిర్భయంగా ఆడి ఆకట్టుకున్నాడని గుర్తుచేశాడు.
స్థానిక తమిళనాడు ప్రతిభను CSK ఎందుకు విస్మరించిందని రైనా ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్కు అద్భుతంగా ఆడుతున్న సాయి సుదర్శన్, సాయి కిషోర్, షారుఖ్ ఖాన్ వంటి వారిని ప్రశంసించాడు. గతంలో మురళీ విజయ్, ఎల్ బాలాజీ, బద్రీనాథ్ వంటి స్థానిక స్టార్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశాడు.
CSK పవర్ప్లే బ్యాటింగ్ తీరును కూడా రైనా తప్పుబట్టాడు. "గతంలో మేం పవర్ప్లేలో అనవసరంగా డాట్ బాల్స్ ఆడేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు తొలి ఆరు ఓవర్లలో దూకుడు లోపించింది, గెలవాలనే ఉద్దేశం కనిపించడం లేదు" అని విమర్శించాడు. ఒకప్పుడు బలమైన ఆరంభాలే CSK విజయ ఫార్ములా అని రైనా గుర్తు చేశాడు.