ఈ మద్య చైనా ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తక్కువ ధర..ఎక్కువ ఫీచర్లు ఉండటంతో చైనా మొబైల్స్ బాగా డిమాండ్ పెరిగింది. అయితే గత కొంత కాలంగా చైనా మొబైల్స్ పేలుతున్నాయి ఎన్నో సార్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ చైనా మొబైల్ మాత్రం భారీ స్థాయిలో పేలి ఓ బాలుడికి కన్ను, చేయికి ప్రమాదం జరిగింది. ఆ బాలుడు తన ఫోన్ చార్జింగ్ పెట్టాడు..ఎంత చార్జింగ్ అయ్యిందని చూసుకున్నాడు. ఒక్కసారే పేలడంతో..ఓ కన్ను చూపు కోల్పోయాడు.
అంతే కాదు అతడి కుడిచేతి చూపుడు వేలు విరిగి ముక్కలై చేతి నుంచి వేరయింది. ఈ విషాద ఘటన చైనాలో ఇటీవల చోటు చేసుకుంది. దక్షిణ చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్ ప్రాంతంలో మెంజ్ జిషూ(12) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. తన హువా టాంగ్ వీటీ-వీ59 మోడల్ మొబైల్ను ఇంట్లో ఛార్జింగ్ పెట్టాడు జిషూ. కొద్దిసేపు తర్వాత ఫోన్ను ఛార్జింగ్ తీసేయాలని చూడగా.. చేతిలోకి తీసుకున్న వెంటనే భారీ శబ్ధంతో ఆ మొబైల్ పేలిపోయింది.
ప్లాస్టిక్ ముక్కలు బాలుడి తల, కంట్లోకి చొచ్చుకెళ్లడంతో క్షణాల్లో కుప్పకూలిన బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. దాదాపు ఐదు గంటలపాటు తీవ్రంగా శ్రమించి సర్జరీ చేసి జిషూని బతికించినట్లు డాక్టర్ లాన్ టియాన్బింగ్ చెప్పారు. హాస్పిటల్కు తెచ్చేటప్పటికే బాలుడి కుడిచేతి చూపుడువేలు లేదని, ఇప్పుడు సర్జరీ చేసినా అతికించడం కుదరదని పేర్కొన్నారు.