కరోనా వైరస్.. గత ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచదేశాలు విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో పలు దేశాలు కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించారుజ. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. అయితే ఈ కరోనా కష్టకాలంలోనూ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులతో పాటు ఆన్లైన్ మోసాలూ జోరుగా సాగుతున్నాయి. లాటరీ తగిలిందనో, గిఫ్ట్ వచ్చిందనో, ఉద్యోగాల పేరుతోనో, లోన్లు ఇప్పిస్తామనో ఇలా ఎన్నో రకాలుగా వల విసిరి మోసాలకు పాల్పడే నేరగాళ్లు.. ఇప్పుడు కరోనాను అడ్డుపెట్టుకుని ప్రజలను దోచుకుంటున్నారు.
అయితే ఇలాంటి సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ.. గూగుల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా టైమ్ నడుస్తుందని కాబట్టి.. మాస్కుల మీద, ఆన్ లన్ వినోదం అందించే సర్వీసులపై డిస్కౌంట్ అందిస్తామని చెప్తూ మిమ్మల్ని బురిడీ కొట్టించడానికి చూస్తుంటారు. అలాంటివి అస్సలు నమ్మకండి. అలాగే కరోనా టెస్ట్ కిట్లు, హ్యాండ్ శానిటైజర్లు అందిస్తామని చెప్తూ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. పొరపాటున మీరు వాటిని నమ్మి డబ్బులు చెల్లిస్తే వారి గోతిలో పడినట్టే అవుతుంది. అదే విధంగా, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కువగా అడిగేవారిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఉదాహరణకు ఇంటి చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతారు. అలాగే మీ ఏటీయం కార్డు పిన్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ అడుగుతారు. దీని ద్వారా మీకు ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తామని అంటారు. కానీ, ఆ తర్వాత మీ అకౌంట్ ఖాళీ చేస్తారు. అందుకే మీరు ఎవరితో మాట్లాడినా సరే.. వారు మీ వ్యక్తిగత వివరాలు అడిగితే అస్సలు ఇవ్వకండి. ఇక మెయిల్, మెసేజ్ లో వచ్చిన లింకులపై క్లిక్ చేసేముందు వాటిని ఒకసారి ధ్రువీకరించుకోండి. లేకుంటే చాలా నష్టపోతారు. మిమ్మల్ని మోసం చేయాలనుకునేవారు ఈ-మెయిల్స్, టెక్స్ట్ మెసేజ్ లు, ఆటోమేటెడ్ కాల్స్, నకిలీ వెబ్ సైట్ల ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. కాబట్టి ఇటువంటివి మీరు చూసినప్పుడు అవి అసలైనవో, నకిలీవో తెలుసుకోవడం చాలా ముఖ్యం.