ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా తీవ్రమైన సందిగ్ధత నెలకొన్న స్థానిక పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుతో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు షురూ అయిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీలకు నజరానాలు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలను భారీగా పెంచడం అలాగే పంచాయతీలు ఏకగ్రీవం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ నేతలు బలవంతంగా ఏకపక్ష ఏకగ్రీవాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ మంత్రులు, పార్టీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ బలవంతపు ఏకపక్ష ఏకగ్రీవాలను కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై గతంలో లెక్కలను బయటపెడుతూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు చంద్రబాబు. 2014లో 2.67 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని.. 1.15 శాతం జడ్పీటీసీలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చంద్రబాబు తెలిపారు. అయితే ఈ దఫా 2020లో ఏకంగా ఎంపీటీసీలు 23 శాతం.. జడ్పీటీసీలు 19 శాతం ఏకగ్రీవం చేశారని అన్నారు. టీడీపీ హయాంలో అన్ని అంశాల్లో రాష్ట్రం నంబర్ వన్ గా ఉండేదని. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. గడిచిన ఈ 20 నెలల పాలనలో ప్రజలకు, రాష్ట్రానికీ ఏం చేశారని మీకు ఓటు వేయాలని.. ఎలా ఏకగ్రీవమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు.





పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయనకు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు. తంబళ్లపల్లెలో కూర్చొని ఏకగ్రీవాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. రౌడీయిజంతో చేసే ఏకగ్రీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. మాచర్ల, తెనాలి వంటి ఘటనలు జరిగితే ఇకపై చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఏకగ్రీవాలపై సీఎం మంత్రులకు టార్గెట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు, దెందులూరు ఘటనలకు ఎవరు సమాధానం చెబుతారని.. ప్రజలకు కనీసం తాగునీటిని ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ జగన్ సర్కార్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో టీవీ5 ప్రసారాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో భద్రత, ప్రశాంతతకు భరోసా లేదని.. తాను రామతీర్థం వెళ్లి అధికార పార్టీ నేతల కుట్రలను బయటపెట్టడంతోనే దేవాలయాలపై దాడులు కంట్రోల్ అయ్యాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: