‘‘జాతీయ స్థాయిలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే ‘ఆల్‌ ఇండియా కంపెనీ లా క్విజ్‌’ పోటీలు చాలా ప్రతిష్టాత్మకం. కొవిడ్‌ కారణంగా ఈసారి ఈ పోటీల ప్రక్రియను రెండు నెలలకు పైగా నిర్వహించారు. ఆన్‌లైన్‌, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా ఈ పోటీలు జరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షమందికి పైగా దీనిలో పాల్గొన్నారు. ఈ పోటీలో తొలి స్థానంలో నిలిచిన తెలుగమ్మాయి వీణా ఎస్ రెడ్డి. ఈ విజయంతో చాలా సంతోషంగా ఉందని చెప్పిన ఆమె.. తన అనుభవాన్ని వెల్లడించింది. ‘‘ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ పూర్తి చేశాను కాబట్టి ఈ పోటీల మీద నాకు కొంత అవగాహన ఉంది. కొవిడ్‌ వల్ల ఇంటి పట్టునే ఉండటం వల్ల మరింత శ్రద్ధగా ప్రిపేర్‌ అయ్యే అవకాశం కూడా దొరికింది. పోటీదారుల్ని వారి ప్రాంతాల ప్రకారం నాలుగు రీజియన్లుగా విభజించారు. రెండు రౌండ్ల ప్రక్రియ ముగిసింది. ఆ సమయానికి పోటీదారులు పదుల సంఖ్యలోకి వచ్చారు. మూడో రౌండ్‌ చివరకు మిగిలింది నలుగురమే! కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించింది నేను మాత్రమే! తుది పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది’’ అని వీణ చెప్పారు. ఇటీవల ప్రకటించిన ఈ పోటీ ఫలితాల్లో ఆమె ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ విభాగంలో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచారు. ఆమెకు యాభై వేల రూపాయల నగదు బహుమతి లభించింది. ఎంతో పోటీని తట్టుకొని ఇలా రాణించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని వీణ సంబరాలు చేసుకుంటున్నారు.

వీణ తండ్రి జగన్నాథ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నల్లప్పగారి పల్లి గ్రామానికి చెందిన వారు. ఆయన బెంగళూరులో ఇరవయ్యేడేళ్ళ నుంచీ చార్డర్డ్‌ అకౌంటెన్సీ కంపెనీ నిర్వహిస్తున్నారు. వీణ తల్లి పేరు లక్ష్మీదేవి. ఎమ్మెస్సీ బిఈడీ చదివారు. తనకు చదువు మీద ఆసక్తి పెరగడానికీ, ఈ రంగంలో ఇంతలా రాణించడానికీ వారిద్దరే కారణమని వీణ గర్వంగా చెప్తారు. వీణ అక్క తనురెడ్డి కూడా చార్టర్డ్‌ అకౌంటెన్సీ కోర్సు చేసింది. ప్రస్తుతం లక్నో‌ ఐఐఎంలో ఎంబిఏ చదువుతోంది. ఇలా అందరూ చదువరుల కుంటుంబం నుంచి రావడం వీణకు బలంగా మారింది. ‘‘బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి... ఇదే నా తపన. పదో తరగతి వరకూ నా చదువు బెంగళూరులోని కుమరన చిల్డ్రన్‌ హోమ్‌లో సాగింది. టెన్త్‌లో 97.60 మార్కుల్తో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్‌లో పాసయ్యాను. ఆ తరువాత జయనగర్‌ జైన్‌ కళాశాలలో పీయూ చదివాను. కామర్స్‌లో 98.83 శాతం మార్కులు సాధించాను. కామర్స్‌ విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ నాదే! అదే ఏడాది... అంటే 2017లోనే ఛార్టర్ట్‌ అకౌంటెన్సీ ఎంట్రన్స్‌ రాశాను. తొలిసారే డిస్టింక్షన్‌లో పాసయ్యాను. ఆ తరువాత సిఎ-ఐపీసీసీ, అకౌంటెన్సీ ఫైనాన్సింగ్‌లో ఇందిరా గాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష, ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ ఫైనల్స్‌... ఇవన్నీ నాలుగేళ్ళలో పూర్తి అయిపోయాయి’’ అని తన ప్రస్థానం గురించి చెప్పారు వీణ. భవిష్యత్తులో ఆమె మరిన్ని అద్భుతాలు సాధించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: