గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధుల అదృశ్యం తాజాగా కలకలం రేపుతున్న‌ది.  నిన్న మధ్యాహ్నం స్కూల్ నుంచి నలుగురు విద్యార్థులు సినిమాకెళ్లడంతో టీచర్లు మందలించారు.  తల్లిదండ్రులను తీసుకొని రావాల‌ని చెప్పి ఇంటికి పంపించారు. అయితే ఆ నలుగురు విద్యార్థులు ఇంటి వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అదృశ్య‌మ‌య్యారు.  నిన్నటి నుంచి కనిపించకుండా పోవడంతో వారి త‌ల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.  

 వివ‌రాల్లోకి వెళ్లితే.. మంగళగిరి టిప్పర్ల బజార్ లో ఉన్న మున్సిఫల్ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు పాఠ‌శాల‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాజీవ్ గృహకల్పలో నివాస ముండే నలుగురు విద్యార్థులు వెంకట్, ప్రభు దేవా, సంతోష్, వెంకీ ఎప్పటిలాగే నిన్న కూడా పాఠ‌శాల‌కొచ్చారు.  స్కూల్ నుంచి ఎవరికీ చెప్పకుండా అఖండ సినిమాకు వెళ్ళారు. సినిమా ముగిసిన త‌రువాత తిరిగి  పాఠ‌శాల‌కు వచ్చారు. సినిమాకి వెళ్లార‌నే  విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించి.. తల్లిదండ్రులను తీసుకు రావాలని ఇంటికి పంపారు. దీంతో పాఠ‌శాల‌ నుండి బయలు దేరిన విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్ళలేదు. రాత్రి వరకూ  వారి రాక కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. న‌లుగురు విద్యార్థుల అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థుల కోసం గాలింపులు చేప‌డుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: