ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తోన్న క‌రోనా దెబ్బ‌తో అన్ని దేశాల్లో బిజినెస్ ఘోరంగా దెబ్బ‌తింటోంది. ఈ క్ర‌మంలోనే అగ్ర రాజ్యం అమెరికా నుంచి అన్ని దేశాల్లో షేర్ మార్కెట్ ప‌డిపోతోంది. ఇప్పుడు ఇది భార‌త మార్కెట్‌పై సైతం తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. కొద్ది రోజులుగా క‌రోనా ఎఫెక్ట్‌తో ప‌త‌న‌మ‌వుతోన్న దేశీ స్టాక్ మార్కెట్ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్ర‌వారం ఉద‌యం ఆరంభంలోనే బెంచ్‌మార్క్ సూచీలు కుప్పకూలాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఆరంభంలోనే 10 శాతం చొప్పున క్షీణించాయి. దీంతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను నిలిపేశారు.



గ‌త 12 ఏళ్ల‌లో ఇలా షేర్ మార్కెట్ ప్రారంభ‌మైన వెంట‌నే నిలిచిపోవ‌డం ఇదే తొలిసారి. అంటే క‌రోనా దెబ్బ‌తో మ‌న స్టాక్ మార్కెట్ చెత్త రికార్డు 12 ఏళ్ల క‌నిష్ట ప‌త‌నానికి చేరుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 9.43 శాతం తగ్గుదలతో 29,687 పాయింట్లకు పతనమైంది. అంటే సెన్సెక్స్ 3,000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 10 శాతం పతనంతో (966 పాయింట్లు) 8624 పాయింట్లకు క్షీణించింది.



ఇక ఓవ‌రాల్‌గా మార్కెట్‌కు 45 నిమిషాల బ్రేక్ ఇచ్చారు. ఇలా 12 ఏళ్ల‌లో ఇలా జ‌ర‌గడం ఇదే తొలిసారి. క‌రోనా దెబ్బ‌తో ఇండియా రూపాయి కూడా ఘోరంగా ప‌త‌న‌మ‌వుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి 20 పైసలు పడిపోయింది. 74.42 వద్ద ట్రేడవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: