మరి ఈ మాటలు నిజమేనా.. వ్యవసాయం తెలంగాణ దిశ మారుస్తుందా.. వ్యవసాయంలో పుంజుకున్నాం సరే.. వ్యవసాయ దిగుబడులు పెరిగాయి సరే.. కానీ అంతటితో రైతు అభివృద్ధి జరుగుతుందా.. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించొద్దా.. రైతుకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడవద్దా.. మా పంట కొనండి మహాప్రభో అని రైతులు ఈ ఏడాది మొరపెట్టుకోలేదా.. పండిన పంటను సకాలంలో కొనక రైతులు తమ పంట కాపాడుకోలేక.. ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం కాలేదా..?
నిజమే వ్యవసాయం తెలంగాణ దిశను మారుస్తుంది.. ఎప్పుడు.. పండిన పంటను సద్వినియోగం చేసినప్పుడు.. కేవలం ఎఫ్సీఐ గోడవున్లకు తరలించేందుకో.. మార్కెట్లలో అమ్ముకునేందుకో రైతు పంట పండించకూడదు. సదరు పంటకు విలువజోడించే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాలి.. అప్పుడే రైతు పంటకు డిమాండ్ వస్తుంది.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెరగాలి.. వాటికి ప్రోత్సాహకాలు అందాలి.. మనం పండించిన పంట మళ్లీ మన ప్రజలకే పోషకాలు అందించే ఉత్పత్తులుగా చవకగా మార్కెట్లోకి రావాలి.
ఇల్లంతకుంట అనే ప్రాంతం ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామాగా ఉండేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు అక్కడ లక్ష టన్నుల దిగుబడి పెరిగిందని... సేద్యాన్ని లాభసాటి పరిశ్రమగా మార్చేందుకు ఆహారశుద్ధి యూనిట్లను బలోపేతం చేయాలని అంటున్నారు. అదే జరగాల్సి ఉంది. జిల్లాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో పంటల సాగు ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనా మంచిదే. మంత్రి కేటీఆర్ రైతులకు ట్యాబ్లు అందించే అవకాశాలూ పరిశీలిస్తామంటున్నారు. వ్యసాయ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహిస్తే.. తెలంగాణలో సాగు విప్లవం సాధ్యమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి