తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోనే పేరున్న రాజకీయ వ్యూహకర్త సేవలు వినియోగించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అది ఎంత వరకూ నిజం అన్న విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలూ లేవు.. ఇలాంటివి అధికారికంగా చెప్పడం కష్టమే కానీ.. పీకే సేవలు మాత్రం కేసీఆర్ వుపయోగించుకుంటున్నారని మీడియా వర్గాల్లో భారీగా చర్చ జరుగుతోంది. అంతే కాదు.. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌కు కేసీఆర్ ఓ టాస్క్ అప్పజెప్పారట కూడా.


ఇంతకీ ఆ టాస్క్ ఏంటంటారా.. కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామని భావిస్తున్నారు. అయితే.. టీఆర్‌ఎస్‌కు ఉన్న తక్కువ ఎంపీల సంఖ్య కారణంగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పటం చాలా కష్టం.. కేవలం 17 ఎంపీ సీట్లు మాత్రమే తెలంగాణకు ఉన్నాయి. వాటిలో టీఆర్ఎస్‌ గెలుచుకున్నది 15లోపే.. మరి ఇంత తక్కువ సంఖ్యతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం సాధ్యమయ్యే పని కాదు. కానీ.. కేసీఆర్ సంగతి తెలిసిందే. పట్టుబడితే వదిలే రకం కాదు.


అందుకే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్‌ కోసం పీకే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే.. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే కావలసిన ఢిల్లీ స్థాయి సంబంధాలు కేసీఆర్‌కు లేవు. అంతే కాదు.. కేసీఆర్‌ బీజేపీతో పొత్తు లేదా అవగాహన వంటి అంశాల్లో  కేసీఆర్ ఎప్పుడూ స్థిరమైన వైఖరితో లేరు. కొద్దిరోజులు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తా అంటారు.. ఆ తర్వాత మర్చిపోతారు. హైదరాబాద్‌లో అన్ని పార్టీలతో పెద్ద సమావేశం పెడతా అన్నారు.  ఆ తర్వాత మర్చిపోయారు. ఇలాంటి ఉదాహరణలు కేసీఆర్ విషయంలో చాలా చెప్పొచ్చు.


మరి ఇలాంటి నేపథ్యం ఉన్న నేత.. కేవలం 15 ఎంపీ సీట్లు మాత్రమే ఉండే నేత జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం సాధ్యమేనా.. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఈ పనిని ప్రశాంత్ కిషోర్‌ కు అప్పగించారట. ఇదీ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం.. మరి  ప్రశాంత్ కిషోర్‌ ఆ పని విజయవంతంగా చేస్తారా.. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లో ప్రముఖ నేతగా నిలబెడతారా.. చూద్దాం.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: