
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర కేబినెట్ అభిప్రాయపడింది. అందుకే రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాల అంశంపై చర్చించిన రాష్ట్ర కేబినెట్.. ఇవి యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని అభిప్రాయపడింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర కేబినెట్ భావించింది.
అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సమర్థ కట్టడి, నియంత్రణలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియ, చర్యలు చేపట్టాలని హోంశాఖను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కొత్త పోలిస్ స్టేషన్లు, సర్కిల్ లు, డివిజన్ల ఏర్పాటుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.