
రాహుల్ గాంధీ అనర్హత వేటు, ఆదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం తదితర అంశాలపై నిన్న సమావేశమైన పీసీసీ సర్వసభ్య సమావేశం పలు అంశాలపై చర్చించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్ రావ్ ఠాక్రేలతోపాటు పార్టీ సీనియర్ నాయకులు అంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన కులి కుతుబ్ షా మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రకటించారు.
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచన మేరకు ఈ నెల 8వ తేదీన మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 10వ తేదీ నుంచి తిరిగి తన పాదయాత్ర మొదలవుతుందన్న రేవంత్ రెడ్డి జహీరాబాద్ లోకసభ నియోజక వర్గంలో మిగిలిన నాలుగు అసెంబ్లీస్థానాలతోపాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
గజ్వెల్లో భారీ నిరుద్యోగ నిరసన సభ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేపర్ లీక్ విషయంలో ఎన్. ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్ చేసిన ఉద్యమాలను రేవంత్ రెడ్డి అభినందించారు. రేవంత్ రెడ్డి న్యాయస్థానంలో వేసిన కేసు విచారణ కొనసాగుతోందని..ఈడీకి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ముందుకు పోతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ గాంధీభవన్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు. రాహుల్ గాంధీని కలిపించాలని, కర్ణాటక ప్రచారానికి వెళ్లేప్పుడు తాను కూడా వస్తానని గద్దర్ అడిగారు.