ప్రజలు తమకు అప్పగించిన అధికారాన్ని ప్రజా  ప్రతినిధులు వినయంగా స్వీకరించి ప్రజా సేవ చేయాలి తప్ప గెలుపు ఇచ్చిన అహంకారంతో ప్రజాకంటకంగా వ్యవహరిస్తే తిరిగి మూలను కూర్చోబెడతారు. ఇది ప్రతి ఎన్నికల్లో సర్వసాధారణంగా జరిగేదే.  ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలు.


క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి మంత్రుల వరకు దాదాపు చాలామంది నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో పాటు మేడిగడ్డ కుంగడం తదితర అంశాలు బీఆర్ఎస్ కు ప్రతి కూలంగా మారాయి. దాదాపు 73శాతం మంది బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది అని విశ్వసించాయి.  ఫలితం మనకు సుస్పష్టంగా కనిపించింది. ఇప్పుడీ ప్రభావం ఏపీపై పడనుందా అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.


పథకాల విషయంలో ఏపీ, తెలంగాణలో భారీ వ్యత్యాసాలే ఉన్నాయి. ఏపీలో జగన్ నేరుగా బటన్ నొక్కి పైరవీలకు తావు లేకుండా లబ్ధిదారుని ఖాతాకే నగదు జమ చేస్తున్నారు. ఇందులో మూడో వ్యక్తికి ప్రమేయం లేదు. దీనివల్ల ప్రజల్లో కొంత సానుకూలత ఉంది. అయితే ఏపీలో అవినీతి అనే అంశం అంతగా ప్రభావం చూపకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఎందుకంటే 2014లో టీడీపీ జగన్ అత్యంత అవినీతి పరుడు రూ.లక్ష కోట్ల అవినీతి కేసులో జైలు జీవితం అనుభవించి వచ్చారు అని టీడీపీ, బీజేపీలు పెద్ద ఎత్తున ప్రచార చేసినా కేవలం రెండు శాతం ఓట్లతోనే వైసీపీ ఓడిపోయింది.


2019 ఎన్నికల్లో టీడీపీ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడింది అని చెప్పినా రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువ. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలపై వచ్చిన ఇసుక, భూ ఆక్రమణ ఆరోపణలే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్నాయి. అందుకే జగన్ పలు చోట్ల అభ్యర్థులను మార్చుతున్నారు. అందువల్ల తెలంగాణలో మాదిరిగా అవినీతి అనేది ఏపీలో ప్రధాన అస్త్రంగా మారదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: