టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయింది. అయితే అది కాస్తా బాగా ఆలస్యం కావడంతో పిఠాపురం నుంచి అనపర్తి మీదుగా అనంతపురం వరకు ఎక్కడ అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. ఈ అసంతృప్తి జ్వాలల్లో తెలుగుదేశం జెండాలే కాదు, చంద్రబాబు ఫొటొలు కూడా తగలబెడుతున్నారు. ఇప్పుడు ఈ దృశ్యాలన్నీ జనం కళ్లకు కట్టినట్లు సోషల్ మీడియాలో విజృంభిస్తున్నాయి. తెలుగుదేశం- జనసేన- భాజపా కూటమిలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడానికి టీడీపీ అనుకూల మీడియా కూడా కొంత కారణంగా చెప్పుకోవచ్చు.
కొన్ని నెలలుగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది, వైకాపా పాతాళానికి పడిపోయింది అనేలా టీడీపీ అనుకూల మీడియా వార్తలు రాస్తోంది. ఈ వార్తలు చూసి టీడీపీ నాయకుల్లోనూ నమ్మకం బాగా పెరిగిపోయంది. గెలిచేసి అధికారం అనుభవించేయాల్న ఆత్రం పెరిగింది. మరి ఇలాంటి సమయంలో టికెట్లు దక్కని వాళ్లు ఊరుకుంటారా.. అందుకే టీడీపీ-జనసేన- బీజేపీ టికెట్లు దొరకని వారు ఇంతగా లొల్లి చేస్తున్నారు.
దీనికి తోడు.. కూటమి కారణంగా టీడీపీ మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ మొత్తం కలిపి 40 స్ధానాలు కోల్పోయింది. ఆ నలభై స్ధానాల్లో కనీసం 30 చోట్ల తెలుగుదేశంకి మంచి గట్టి నాయకులు ఉన్నారు. ఇప్పుడు వారే రచ్చ రచ్చ చేస్తున్నారు. మరిలో వీరిలో ఎందరు అధిష్టానం మాట వింటారో.. ఎందరు రెబల్స్గా బరిలో దిగుతారో.. చూడాల్సి ఉంది. మొత్తానికి కూటమితో వచ్చిన లాభమెంతో కానీ.. టీడీపీకి ఇది గుదిబండగా మారిందనడంతో సందేహం లేదు.