తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం పర్యాటకుల ప్రాణాలు బలిగొంది. అయితే కృష్ణా, గోదావరి నదుల్లో గతంలో జరిగిన బోటు ప్రమాదాలను పరిశీలిస్తే, ఆదివారం రోజే ఎక్కువ జరిగినట్లు స్పష్టం అవుతోంది . వారాంతపు సెలవు దినం కావడంతో అధికమంది బోటు షికారు చేయడానికి ఇష్టపడి, ఎక్కువ సంఖ్యలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు . 2017 నవంబర్ 12 న విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం వద్ద కార్తీకమాసం సందర్భంగా జరిగిన బోటు ప్రమాదంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు 22మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
అలాగే 2018 జులై లో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ తిరగబడిన ఘటన లో 15 మంది మృతి చెందారు. తాజాగా జరిగిన బోటు ప్రమాదంలో 39 మంది గల్లంతు, కాగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటులో మొత్తం 73 మంది పాపికొండలు విహార యాత్రకు వెళ్లారు . అయితే ఆ 90 మందికి వరకు బోటులో ప్రయాణం చేయవచ్చునని , బోటులో 150 మందికి సరిపడా లైఫ్ జాకెట్లు ఉన్నాయని యజమాని చెప్పారు . బోటు సిబ్బంది సగం మందికి లైఫ్ జాకెట్లు అందించి, చాలామందికి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విమర్శలు విన్పిస్తున్నాయి .
లైఫ్ జాకెట్లు ధరించిన వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ప్రయాణికులు గల్లంతు అయినట్లు తెలుస్తోంది . బోటు సిబ్బంది నిర్లక్ష్యమే చాలామంది ప్రాణాలను బలిగొన్నదని ... అందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు. పాపికొండల వివాహార యాత్రకు వెళ్లినవారిలో హైదరాబాద్ కు చెందిన 22 మంది , వరంగల్ కు చెందిన 14 మంది వెళ్లినట్లు అధికారులు తెలిపారు .