మొబైల్ ఫోన్‌ ద్వారా అపరిచిత అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు సేకరించి వేధించే పోకిరీలకు కొదవు లేదు. కానీ.. షీ టీమ్స్ వంటి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఇలాంటి పోకిరీల ఆటకట్టవుతుంది. వారు ఫోన్ చేసిన నెంబర్ ఒక్కటి చాలు.. వారిని పట్టుకునేందుకు.. ఇలా గతంలో చాలామంది పోకిరీల ఆట పోలీసులు కట్టించారు. అయితే ఇప్పుడు పోకిరీలు కూడా తెలివి మీరారు.. పోలీసులకు దొరక్కుండా వేధించేందుకు కొత్త మార్గాలు వెదుకుతున్నారు.


ఇలాంటి పోకిరీలకు ఇప్పుడు సైబర్ నేరగాళ్లు సహకరిస్తున్నారు. వారు కనిపెట్టిన తాజా అస్త్రం వర్చువల్ సిమ్‌కార్డ్.. వర్చువల్‌ నంబర్లను వినియోగిస్తున్న వారు ఎవరికీ తెలియకుండా ప్రైవేటు సంభాషణల కోసం, గిట్టనివారిని వేధించేందుకు, బెదిరించేందుకు వాడతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వర్చువల్‌ నంబర్లను వాడుతున్న వారిని గుర్తించడం  కష్టం. ఎందుకంటే ఆ ఫోన్‌ నంబర్‌ అమెరికా, దుబాయ్‌, షాంఘై అంటూ వేర్వేరు ప్రాంతాలను చూపిస్తోంది.


ఇటీవల ఓ యువతి తనను వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించగా ఈ విషయం వెలుగు చూసింది. ఒక యువతిని వేధించిన కేసులో నిందితుడిని విచారిస్తున్న క్రమంలో సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడి ఫోన్‌ను బుధవారం పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  టెలిగ్రామ్‌ మెసెంజర్‌లో ‘ఓటీపీ బయ్యర్స్‌, సెల్లర్స్‌’ పేరుతో  సైబర్ నేరగాళ్లు  ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. వినోద ఛానళ్ల వీక్షణాన్ని తక్కువ ధరలకే అందిస్తున్న సైబర్‌ నేరస్థులు వర్చువల్‌ అవసరమైనవారికి వర్చువల్‌ సిమ్‌కార్డులనూ సమకూర్చుతున్నారు.


ఈ వర్చువల్ సిమ్‌కార్డు .. అసలు సిమ్‌కార్డు నిందితుల వద్దే ఉంటుంది. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ యువకుడు.. ఒక యువతిని వేధించేందుకు నిందితుల నుంచి వర్చువల్‌ సిమ్‌కార్డు తీసుకున్నాడు. నెలరోజుల నుంచి వేధిస్తున్నాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా తొలుత పోలీసులకు ఎవరన్నది తెలియలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని గుర్తించారు. విచారించగా ఓటీపీ బయ్యర్స్‌, సెల్లర్స్‌తోపాటు వర్చువల్‌  సిమ్‌ కార్డుల విషయం బయటకు  వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: