విజయనగరం అసెంబ్లీ స్థానం...పూసపాటి అశోక్ గజపతి రాజు కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ పార్టీల ఆధిక్యం కంటే అశోక్ హవానే ఎక్కువగా ఉంటుంది. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్.. ఆ తర్వాత 1983,1985, 1989, 1994,1999, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్క 2004లోనే ఈయన ఓటమి పాలయ్యారు. అయితే 2014లో అశోక్ విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక విజయనగరం అసెంబ్లీలో టీడీపీ తరుపున మీసాల గీత పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ తరుపున అశోక్ కుమార్తె అతిథి పోటీ చేయగా, వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి బరిలో ఉన్నారు. ఇక జగన్ వేవ్‌లో అశోక్ కుమార్తెపై కోలగట్ల గెలిచారు.

సీనియర్ ఎమ్మెల్యే అయినా కోలగట్ల...నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారు. జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పెత్తనం నడుస్తుంటే, ఇక్కడ మాత్రం కోలగట్లదే హవా. ప్రభుత్వ పథకాలు, ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యేకు ప్లస్. అలాగే ఎప్పుడు ప్రజల్లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి.

విజయనగరం దరిదాపుల్లో ఎన్ని నదులు ప్రవహిస్తున్నా జిల్లా కేంద్రంమైన విజయనగర పట్టణంలో మాత్రం తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తాగు నీటి సమస్య తరువాత ఈ పట్టణంలో అతి పెద్ద సమస్య ఇరుకైన రహదారులు, డ్రైనేజ్ సమస్య. ఎన్నో ఏళ్ళు అశోక్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా, నగరంలో సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి.

ఇక రాజకీయంగా చూసుకుంటే కోలగట్ల బలంగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇటు టీడీపీ వైపు ఉన్న అతిథి కూడా నియోజకవర్గంలో బాగానే కష్టపడుతున్నారు. తండ్రి అశోక్ అండతో విజయనగరంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే జగన్ హవా ఉంటే అశోక్ కుమార్తె గెలుపు కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: