యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘యోగి’ సినిమా గుర్తుందా? ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నయనతార ఆడిపాడింది. ఈ సినిమాలో హీరో బాగా పాపులర్ అవడంతో.. అతను తమకు తెలుసు అని అబద్ధాలు చెప్తూ, అతనితో పనులు చేయిస్తామని చెప్పి కొంత మంది ప్రజలను మోసాలు చేస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు ఆ సినిమా హీరో ప్రభాస్ పేరు చెప్పి కూడా ఇలానే మోసాలు జరుగుతున్నాయి.

చిత్ర సీమలో మోసాలు జరగడం సాధారణం. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని నటులను, స్టార్ హీరో డేట్స్ ఇప్పిస్తామని నిర్మాతలను మోసగాళ్లు ఇట్టే మోసం చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటిదే మరో భారీ మోసం వెలుగు చూసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించేందుకు సువర్ణ అవకాశం ఉందని, ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలని చెప్తూ ఓ ముఠా ఔత్సాహికులను మోసం చేస్తోంది. విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో అవకాశాలు ఉన్నాయని ఓ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రకటన విడుదల చేశారు.

అంతే కాకుండా ఈ అవకాశం కోసం ముందుగా పేరు నమోదు చేసుకోవాలని, అందు కోసం కొంత మొత్తం చెల్లించాలని సూచించారు. ప్రభాస్ సినిమాలో అవకాశం అనేసరికి చాలా మంది ముందూ వెనుకా ఆలోచించకుండా డబ్బులు చెల్లించారు. నమోదు చేసుకున్న వారికి కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మెసేజ్ వస్తుందని, సిద్దంగా ఉండాలని ప్రొడక్షన్ సంస్థ వారు చెప్పినట్లు సమాచారం. దాంతో నమోదు చేసుకున్న వాళ్లందరూ ఆ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. చాలా కాలం గడిచినా ఎటువంటి మెసేజ్ రాలేదు.

దాంతో తమకున్న అనుమానాన్ని తీర్చుకోవడానికి ఆ ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లి ఆరా తీశారు. అంతే తాము మోసపోయామని తెలిసిపోయింది. దాంతో వారంతా పోలీసులను ఆశ్రయించారు. ముంబై కేంద్రంగా జరిగిన ఈ మోసంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రతి ఒక్కరి నుంచి దాదాపు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: