
హైదరాబాదులోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి సినీ ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, ఇండస్ట్రీ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది.. వయసు పైబడ్డంతో... అనారోగ్య కారణాలవల్ల ఆమె హైదరాబాదులోనే తన ఇంటిలో కన్నుమూసినట్లు సమాచారం. ప్రస్తుతం జమున వయసు 86 సంవత్సరాలు. 1953 పుట్టిల్లు అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన జమున.. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు అందరితో కూడా కలిసి నటించిన జమున తెలుగులోనే కాదు కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో కూడా నటించి మెప్పించింది.
ఆ కాలంలో అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో దివంగతనటి సావిత్రి తర్వాత జమున పేరు వినిపిస్తుంది. అప్పట్లోనే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న జమున ఎన్నో విషయాలలో నిక్కచ్చితంగా ఉంటూ మరెన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంది. నిర్మొహమాటంగా చెప్పే ఈమె అప్పట్లో ఎన్టీఆర్ , ఏఎన్నార్లతో కూడా గొడవకు దిగిన విషయం తెలిసిందే. అంతలా తన స్టార్ డంను కొనసాగించింది జమున. అందానికి అందం అంతకుమించి అభినయంతో ఎక్కువగా సావిత్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది . ఏది ఏమైనా జమున మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.