యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా కాదు.
గ్లోబల్ స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం మన తారక్ NTR30తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2లో ఆయన నటించనున్నారట. ఇప్పటికే బాలీవుడ్ ఈ వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. నవంబరు నుంచి తారక్ వార్-2 చిత్రీకరణలో భాగం కానున్నారని సమాచారం. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. వార్-2లో ఎన్టీఆర్ సరసన ఫీమేల్ లీడ్‌గా ఆలియా భట్‌ను తీసుకోనున్నారట.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా.. తారక్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర దర్శకుడు అయ్యన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో ఆమె ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

బీటౌన్ మీడియా వర్గాల ప్రకారం వార్-2లో హృతిక్ రోషన్ హీరోగా చేస్తుండగా.. తారక్ విలన్ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఇందులో హృతిక్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోందని సమాచారం. మరోపక్క తారక్ పక్కన ఆలియాను ఫీమేల్ లీడ్‌గా తీసుకోనున్నారట.

ఇదిలా ఉంటే ఈ క్యాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. ఆలియా.. జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించేందుకు ఆసక్తి ఉందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ntr 30లో తారక్ సరసన ఆలియాను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ ఆలియా బిజీ షెడ్యూల్, కొరటాల శివ ఆలస్యం కావడం లాంటి కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. చివరకు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే సెట్స్‌లో అడుగుపెట్టిన వీడియోను కూడా టీమ్ విడుదల చేసింది. మరోపక్క కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్‌ కూడా తారక్‌తో మూవీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయన తెరకెక్కించిన విడుదల-1లో భాగంగా తారక్‌తో ఓ మాస్ ఫిల్మ్ తీసేందుకు చర్చలు జరిపినట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: