పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ ఎన్నారై నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేసింది తమిళ నటి శ్రుతి. సాధారణంగా 'పెళ్లి పేరిట ఓ యువతిని మోసగించిన యువకుడి అరెస్టు' అనే వార్తలు చూస్తుంటాం. కానీ, పెళ్లి పేరిట ఓ ఎన్నారైను మోసం చేసిన యువతి కథ ఇది. ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెన్నయ్ కు చెందిన తమిళ వర్థమాన సినీ నటి శ్రుతి మోసానికి పాల్పడింది. సేలంకు చెందిన జి. బాలమురుగన్ అనే వ్యక్తి జర్మనీలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో పని చేస్తున్నాడు. మే 2017లో ఆయన తన ప్రొఫైల్ను మాట్రిమోనియల్ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు.
శ్రుతి ఈ వెబ్సైట్ ద్వారా మైథిలీ వెంకటేశ్గా అతడికి పరిచయమై, ప్రపోజ్ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన కుటుంబ సభ్యుల ఫొటోలు పంపించింది.ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, తన ఆరోగ్యం బాగాలేదని, బ్రెయిన్ ట్యూమర్ ఉందని, తనకు శస్త్రచికిత్స చేయాలని, తన తల్లి ఆరోగ్యం కూడా బాగుండలేదని, ఆమెకు గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని బాలమురుగన్ ని నమ్మించింది.
ఈ మాటలు నిజమని నమ్మిన బాలమురుగన్ పలు వాయిదాల్లో మొత్తం రూ.41 లక్షల వరకు ఆమెకు పంపించాడు. 2017 మే నుంచి ఈ ఏడాది జనవరి 1 లోపు ఈ మొత్తం ఆమెకు పంపించాడు. తనకు కాబోయే భార్య అంటూ శ్రుతి, ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలను బాలమురుగన్ తన స్నేహితులు, బంధువులకు చూపించాడు.
ఫొటోలను చూసి కొంత మంది శ్రుతిని గుర్తుపట్టి అసలు విషయం చెప్పడంతో.. బాలమురుగన్ షాక్ తిన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు బాలమురుగన్ ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని శ్రుతిని, ఆమె తల్లి, సోదరుడుతో పాటు శ్రుతికి తండ్రిగా నటించిన వ్యక్తిని నిన్న అరెస్టు చేశారు.