అందం..అభినయంతో పాటు ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ అందరి మనసు దోచేసింది బెంగుళూరు బ్యూటీ అనుష్క. స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క..అక్కినేని నాగార్జున సరసన ‘సూపర్ ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదట్లో గ్లామర్ తరహా పాత్రలతో కుర్రాళ్ల మనసు దోచిన అనుష్క తర్వాత ప్రయోగాత్మక పాత్రలో నటిస్తూ అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆమె నటనలకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టారు. అరుంధతి, రుద్రమదేవి,సైజ్ జీరో, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది అనుష్క.
బాహుబలి సినిమాలో దేవసేనగా కనిపించిన అనుష్క ఆ తర్వాత భాగమతి ఉగ్రరూపంతో కనిపించింది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క తాజాగా ప్రముఖ రచయిత కోన వేంకట్ నిర్మిస్తున్న ఓ సినిమాలో నటించబోతుంది. బాహుబలితో జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అనుష్కతో హాలీవుడ్ తారలు సైతం నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భాగమతి అనే థ్రిల్లర్ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయనుంది. కోన వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం థ్రిల్లర్ మూవీగా ఉంటుందట. మూవీ చిత్రీకరణ ఎక్కువ శాతం అమెరికాలో జరగనుందని తెలుస్తుంది.
అయితే బాహుబలి సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క తమతో సినిమా తీస్తుందని తెలియగానే కొంత మంది హాలీవుడ్ నటులు మా సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు అని కోన వెంకట్ ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతే కాదు ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ కూడా ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారట. తెలుగు తమిళ భాషలలో చిత్రాన్ని రూపొందించేందుకు కోన వెంకట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.