ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్. ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్స్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్రేజీహీరో విజయ్దేవరకొండ, అందాలభామ రాశిఖన్నా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన మూవీ కావడంతో అభిమానుల కోసం విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్లు వేదిక మీద క్రికెట్ ఆడడం విశేషం. అలాగే ఈ కార్యక్రమంలో ఏషియన్ సినిమాస్ అధినేత నారాయనదాస్ నారంగ్ పాల్గొన్నారు..
క్రియేటివ్ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు మాట్లాడుతూ - ''నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం దర్శకుడు క్రాంతిమాధవ్. మా బేనర్లో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న చిత్రానికి కాస్టింగ్ ఫైనలైజ్ కోసం చూస్తున్న టైమ్లో తమిళంలో ఐశ్వర్య రాజేష్ నటించిన 'కణ' చిత్ర టీజర్ను నాకు చూపించాడు క్రాంతి మాధవ్. ఆ పెర్ఫామెన్స్ నచ్చి ఆ క్యారెక్టర్ కోసం ఆమెను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టీజర్ నాకు బాగా నచ్చడంతో 'కణ'సినిమాను తెలుగులో రిలీజ్ చేద్దాం అని ప్రయత్నం చేశాను.. కానీ కుదరలేదు. ఇంతలో సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. తెలుగులో ఆ సినిమా రైట్స్ కోసం నాతో పాటు చాలా మంది నిర్మాతలు పోటీపడ్డారు. నేను మొదటి నుండి ఆ సినిమా మీద ఆసక్తితో ఉండడం వల్లనో, ఐశ్వర్య రికమండేషన్ వల్లనో తెలీదు కానీ చివరకి ఆ సినిమా రైట్స్ నాకే దక్కాయి. తరువాత తెలుగులో కూడా ఆమెను నటించమని అడిగాము. నా మీద తనకున్న ఫాదర్ ఎఫెక్షన్తో తనూ ఒప్పుకుంది. భీమినేని గారు అయితే పూర్తి న్యాయం చేయగలడని ఆయనకే దర్శకత్వ భాద్యతలు ఇచ్చాము. ఐశ్వర్య, రాజేంద్ర ప్రసాద్, సాయంతో సినిమా చాలా గొప్పగా వచ్చింది. ఐశ్వర్య రాజమండ్రిలో ఎండలో తను తమిళ సినిమా కన్నా ఎక్కువ కష్టపడి నటించింది. నా సినిమాలన్నీ కంటెంట్ బాగుండడం ఆ కంటెంట్ తయారుచేసిన వారి గొప్పతనం. ఒక సంవత్సరం 200 సినిమాలు రిలీజైనా వాటన్నింటిలో మన సినిమానే గొప్పగా ఉండాలి అనేంత సెలెక్టీవ్గా ఉంటే తప్ప.. ఒక ప్రొడ్యూసర్గా నిలదొక్కుకోవడం కష్టం. అలా నేను ఈ స్థాయిలో ఉండటానికి కోదండ రామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కె విశ్వనాధ్, అజయ్ ఇలా ప్రతి వారు మా క్రియేటివ్ కమర్షియల్స్ కోసం కష్టపడడమే కారణం. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ బాగా రావడానికి, తమిళ్ సినిమా సోల్ మిస్ అవకుండా ఉండడానికి భీమినేని గారు ఎంతో కష్టపడ్డారు. 2019 లో ఒక గొప్ప సినిమా చూశాం అని ప్రతి ఒక్కరూ ఆనందించే సినిమా ఇది. డెఫినెట్ గా సినిమా ఘన విజయం సాధిస్తుంది అనే నమ్మకంతో 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రాన్ని వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాల్లో క్రియేటివ్ కమర్షియల్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ''పెళ్లి చూపులు' సినిమా నచ్చి మనం కలిసి ఒక సినిమా చేద్దాం.. అని కెఎస్ రామారావు గారు, క్రాంతి మాధవ్ నన్ను కలిశారు. ఆ సినిమా షూట్ నుండే ఇక్కడికి రావడం జరిగింది. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఐశ్వర్య కూడా నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్ నటించిన చాలా సినిమాలు నేను చూశాను. తను మంచి పెర్ఫార్మర్. త్వరలో తనతో కలిసి నటించబోతున్నందుకు చాలా ఎక్సయిటింగ్గా ఉంది. కెఎస్ రామారావుగారిని మేము అందరం సెట్లో డాడీ అని పిలుస్తాము. మా అందరికీ ఒక తండ్రిలా ఏది కావాలన్నా...ఇవ్వడమే ఆయన పని. నాకు నచ్చింది, వచ్చింది సినిమానే ఇదే నా లైఫ్ ఇది కాకపోతే ఇంకేం చేస్తాం అని ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా ప్రతి రోజు సెట్కి వస్తారు. ఆయనకు సినిమా అంటే అంత ప్రేమ ఉండడం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. భీమినేని గారితో సహా ఎంటైర్ టీమ్కి ఆల్దిబెస్ట్. ఆగష్టు 23న విడుదలవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.