‘శాకుంతలం’మూవీ ట్రైలర్ విడుదల సమయంలో మీడియా ముందుకు వచ్చిన సమంత కండిషన్ ను చూసినవారు ఆమె పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని నెలలు సమయంపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు చేసారు. అయితే సమంత ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ కు సంబంధించి మిగిలి ఉన్న 40 రోజుల షూటింగ్ వర్క్ ను ఫిబ్రవరి నెలాఖరు నుండి ఏక బిగిన పూర్తి చేసి ఈమూవీని సమ్మర్ రేస్ లో విడుదల చేసి తీరాలి అన్న స్థిర నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అంతేకాదు ‘శాకుంతలం’ మూవీని ప్రమోట్ చేయడానికి ఆమె రెండు వారాల సమయం ఫిబ్రవరి మొదటి వారం నుండి కేటాయించినట్లు తెలుస్తోంది.


ఫిబ్రవరి 17న మహాశివరాత్రి ని టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న ఈమూవీ ఫలితం సమంతకు అత్యంత కీలకంగా మారింది. ‘శాకుంతలం’ మూవీ ప్రమోషన్ పూర్తి అయిన తరువాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ‘ఖుషీ’ షూటింగ్ కు రాగలిగితే సమ్మర్ రేస్ లో ‘ఖుషీ’ ని నిలపవచ్చు అని ఈమూవీ నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ సమంతకు మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండకు అత్యంత కీలకంగా మారింది. వరస ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ మ్యానియా మళ్ళీ పెరగాలి అంటే ఒక సూపర్ హిట్ మళ్ళీ కావాలి.


‘లైగర్’ సూపర్ ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడంతో అతడితో సినిమాలు తీయడానికి అనేకమంది దర్శక నిర్మాతలు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి కథను అదేవిధంగా ఎలాంటి దర్శకుడుని ఎంచుకోవాలో తెలియక విజయ్ ‘ఖుషీ’ రిజల్ట్ వచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సమంత అనుకున్న విధంగా ఫిబ్రవరి నెలాఖరు నుండి ‘ఖుషీ’ షూటింగ్ కు రాగలిగితే విజయ్ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారం దొరికినట్లే అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: