అమెరికా దేశంలో శాశ్వత నివాసహోదా కల్పించే గ్రీన్‌కార్డుల పొందడం కోసం చాలామంది భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటారు. అయితే ఈసారి వారి ఆశలపై అమెరికా ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఈ ఏడాది ఉపాధి ఆధారిత విదేశీయుల కోసం 2,61,500 గ్రీన్‌కార్డులు జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 1 లక్షా 21 వేలకు పైగా అదనంగా గ్రీన్‌కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ కార్డులన్నీ కూడా సెప్టెంబర్ 2020, సెప్టెంబర్ 2021 మధ్య కాలంలోనే జారీ చేయాల్సి ఉంటుంది. కానీ కరోనా మహమ్మారి విజృంభించడంతో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు గ్రీన్‌కార్డులు జారీ చేసే విషయంలో జాప్యం చేశారు.

దీంతో ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలో గ్రీన్‌కార్డులు విదేశీయులకు అందించబడ్డాయి. ఇక సెప్టెంబర్ నాటికి మిగిలిపోయిన గ్రీన్‌కార్డులు దేనికి పనికిరాని వృథా కార్డులుగా మిగిలిపోతాయి. విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్‌హీమ్‌ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి లక్షకుపైగా గ్రీన్‌కార్డులు వృథాగా మిగిలిపోతాయి అని వెల్లడించారు. దీంతో దరఖాస్తు పెట్టుకున్న వలసదారులు అందరూ ఉసూరు మంటున్నారు. మరో ఐదేళ్ల వరకు వీరంతా కూడా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదని అమెరికా ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. దీంతో చాలామంది వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది కోటాలో తమ అప్లికేషన్లను ముందు వరుసలో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మేరీలాండ్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేశారు. ఇక మిగతా వలసదారుల కంటే భారతీయుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సాధారణంగా 10 ఏళ్ల క్రితం గ్రీన్ కార్డ్ కోసం జారీ చేసుకుంటే.. ఇప్పుడు పరిశీలనలోకి వస్తాయి. ఇవి పరిశీలనలోకి రావడం కూడా ఒక చిరకాల స్వప్నమే చెప్పాలి. అయితే, ఇండియా నుంచి కుప్పలు తెప్పలుగా వలసదారులు కార్డుల కోసం అప్లై చేస్తుండడంతో అమెరికా ప్రభుత్వం ఇండియన్స్ ని ప్రత్యేకంగా పక్కన పెడుతోంది. భారతీయుల కంటే ముందుగా వేరే దేశస్థులకు కార్డులు జారీ చేస్తోంది. దీంతో ఈసారి పరిశీలనలోకి వచ్చి కూడా ఇప్పుడు వృథాగా మిగిలిపోయే అప్లికేషన్స్ గురించి భారతీయులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: