ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల చైనాలో తాజాగా వెలుగులోకి వచ్చి అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మహమ్మారి నావల్ కరోనా వైరస్పై యుద్ధం ప్రకటించింది. ఈ కరోనా వైరస్పై అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. ఇప్పటికే భారత్ తో సహా 20 దేశాలకు ఈ కరోనా త్వరితగతిన విస్తరిస్తోంది. బ్రిటన్లో కూడా తాజాగా ఈ వ్యాధిపై రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ కరోనా వల్ల ఇప్పటికే 213 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల మంది ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. దీనిపై జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టుగా ప్రకటించింది. కాగా, ఈ వైరస్ సోకిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్రిశూర్ వైద్యులు తెలిపారు.
ఇక శుక్రవారం వూహాన్లో కరోనా వైరస్ భయంతో బిక్కుబిక్కు మంటూ ఉన్న అక్కడి భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా బీ746 విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి చైనాకు బయల్దేరి వెళ్లింది. ఈ విమానంలో ఐదుగురు వైద్యులు అయిదుగురు, పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. 400 మంది భారతీయుల్ని తీసుకొని శనివారం మధ్యాహ్నం వెనక్కి వస్తుంది. మరోవైపు సరిహద్దు భద్రతా దళం ఐటీబీపీ ఢిల్లీలో 600 పడకల ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచింది.
నిజానికి ఈ విధంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎప్పుడు పెడతారంటే ... ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడి ఏదైనా వ్యాధి ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ ఉంటే అన్ని దేశాలు కలసికట్టుగా పోరాడడానికి ఇలా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధిస్తారు. దీనినే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్ఈఐసీ) అని అంటారు. పీహెచ్ఈఐసీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రపంచ దేశాలు ఈ వ్యాధిపై సంయుక్తంగా పోరాటం చేయాలి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తారు.