అయితే జగన్ మాత్రం ఆనం సీనియర్ అని కూడా చూడకుండా, తనకన్నా తక్కువ వయసు, తక్కువ రాజకీయ అనుభవము ఉన్న వారికి సొంత జిల్లాలోనే ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టి ఆనం కు చెక్ పెట్టారు. అప్పటికే మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవమున్న ఆనం అగ్గిలం మీద గుగ్గిలం అయిపోయాడు. ఇక అప్పటి నుండి మీడియా వేదికగా ప్రభుత్వంపై అధికారులను అడ్డం పెట్టుకుని తన అక్కసును చూపిస్తూ వచ్చాడు. అయినప్పటికీ జగన్ కానీ అధిష్టానం కానీ ఇతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడే ఆనం రాంగ్ స్టెప్ వేశాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లో పదవులపై ఆశ ఉండడం సహజమే. అలాంటప్పుడు తెలివిగా అధిష్టానాన్ని ఒప్పించి వారికి నచ్చేలా వ్యవహరించి దక్కించుకొవాలి కానీ, ఇలా ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం తగదని అంటున్నారు. ఆనం కు మరియు జగన్ కు మధ్యన ఎంతలా గ్యాప్ పెరిగిపోయిందంటే, అధికారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అప్పాయింట్మెంట్ అడిగినా ఇవ్వనంత దూరం పెరిగింది.
ఇప్పుడు ఈయన ప్రయత్నమంతా రెండవ సారి మంత్రుల ఎంపిక ప్రక్రియలో అయినా అనుకున్నది సాధించాలని తహతహలాడుతున్నారు. కానీ ఆనంపై జగన్ కు చెప్పలేనంత కోపం ఉంది. దీనికి కారణం నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులను గౌరవించకపోగా వారిపైనే విమర్శలు చేయడమే అని టాక్ నడుస్తోంది. ఈ సారి మంత్రుల నియామక ప్రక్రియలో సీనియర్లకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ తో కలిసి నడిచినవారికి మంత్రి పదవులు ఇచ్చేలా ఉన్నారు. అయితే ఆనం కు మాత్రం మంత్రి పదవి దక్కేలా కనిపించడం లేదు. మరి ఈసారైనా ఆనం ను జగన్ కరుణిస్తారా ? ఆనం అనుకున్నది సాధించగలరా ? మళ్ళీ సొంత జిల్లాలో మంత్రిగా తన హవాను కొనసాగిస్తారా ? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పేలా లేదు.